వాటికిచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి
ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేయాలి
వాటిపై చర్యలెందుకు తీసుకోలేదు?
మృతదేహం అప్పగింతకు లక్షలా?
కొవిడ్ రోగుల పట్ల అమానవీయ వైఖరి
పేదలకు 25ు పడకలు కేటాయించాలి
ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు
2 ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం
సర్కారును కౌంటర్ కోరిన ధర్మాసనం
హైదరాబాద్: పేదలకు కొవిడ్ చికిత్స అందించడానికి గుడ్డిగా నిరాకరిస్తున్న రెండు ప్రైవేటు ఆసుపత్రులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రైవేటు ఆసుపత్రులు పేద రోగులను మానవీయ కోణంలో చూడడం లేదని ఆక్షేపించింది. విలువైన భూములను ప్రభుత్వం నుంచి రాయితీపై పొందిన ఈ ఆసుపత్రులు పేద రోగులకు కనీసం 15 నుంచి 25శాతం పడకలు రిజర్వు చేసి, 40 శాతం ఔట్ పేషెంట్లకు ఉచితంగా చికిత్స అందించాలని అభిప్రాయపడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని రెండు ఆసుపత్రులు పేదలకు కరోనా చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఒమిమ్ మాణిక్షా డెబ్రా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ఆసుపత్రులు 50శాతం పడకలను ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిల్ని విచారించింది. 1981, 1989లో ఆయా ఆసుపత్రులు ప్రభుత్వాల నుంచి రాయితీపై భూములు పొందినప్పుడు పేదలకు 50శాతం పడకలు కేటాయిస్తామని హామీ ఇచ్చాయని, ఈ మేరకు ప్రభుత్వం 517, 484 జీవోలు జారీచేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ హామీలు విస్మరించి అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు, పేదలకు వైద్యం నిరాకరించడాన్ని తప్పుబట్టింది.ఈ ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవసరమైతే ఇలాంటి ఆసుపత్రుల భూమి లీజు అగ్రిమెంట్లు రద్దుకు చర్యలు తీసుకోవాలని, లైసెన్సులు రద్దు చేయాలని సూచించింది. చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఆసుపత్రి యాజమాన్యాలు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు విస్మయం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాపై దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జతచేసి విచారణకు వేయాలని రిజిస్ట్రీని ధర్మాసనంఆదేశించింది.
Courtesy Andhrajyothi