- జ్వరం గోలీలు కొంటే ఫోన్ నంబరు, అడ్రస్ ఇవ్వాల్సిందే
- మెడికల్ షాపులకు సర్కారు ఆదేశం
- లక్షణాల ఆధారంగా వారికీ పరీక్షలు
- మునిసిపల్ శాఖ ఆదేశాలు జారీ
- మెడికల్ షాపుల వారికీ కరోనా
గ్రేటర్ హైదరాబాద్లో సర్కిళ్ల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ తమ దగ్గర ఆ మందులు కొన్నవారి వివరాలను ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తారు.
హైదరాబాద్ : ఇక నుంచి జ్వరం మాత్రలు కొంటే.. మీ ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ కచ్చితంగా మెడికల్ షాపు వారికి ఇవ్వాల్సిందే. ఇప్పటి దాకా జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలొస్తే.. వైద్యుడి దగ్గరకు వెళ్లకుండానే దగ్గర్లోని మెడికల్ షాపుల్లో పారాసిటమాల్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఇకపై వివరాలు ఇవ్వందే ఆ మాత్రలను విక్రయించరు. ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ రాష్ట్రంలోని మునిసిపల్ కమిషనర్లు, అదనపు కలెక్లర్లకు మునిసిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇవే ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని మెడికల్ దుకాణాలకూ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఫీవర్ సర్వైలెన్స్ను నిర్వహిస్తూ.. ప్రతి గ్రామంలో జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని భావించిన సర్కారు మెడికల్ దుకాణాల నుంచే జ్వరపీడితుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. చాలా మందిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉంటున్నా.. వారు పరీక్షలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నట్లు ప్రభు త్వం గుర్తించింది. అలాంటి వారు మెడికల్ దుకాణా ల్లో జ్వరానికి పారాసిటమాల్, గొంతునొప్పికి అజిత్రోమైసిన్ లాంటి మెడిసిన్ను సొంతంగా తీసుకొని, వాడుతున్నారు. కొందరు కరోనా బారినపడ్డా.. పరీక్షలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. అందుకే మెడికల్ షాపులవద్దకు వచ్చి.. ఈ మందులు అడిగే ప్రతివారీ వివరాలను తెలపాలని ఆదేశించింది.
లక్షణాలను బట్టి పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 25 వేల దాకా మెడికల్ షాపులున్నాయి. ఈ నేపథ్యంలో.. మెడికల్ షాపులు, వారి అసోసియేషన్స్తో వెంటనే సమావేశమవ్వాలని అన్ని మునిసిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం అడుగుతున్న సమాచారాన్ని మెడికల్ షాపుల వారు విధిగా జాబితా రూపొందించి, ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ జాబితా ఆధారంగా మునిసిపల్, వైద్య ఆరోగ్య సిబ్బంది ఒక రిజిస్టర్ను ఏర్పాటు చేసి, అందులో వివరాలు నమోదు చేస్తారు. ఆ మందులు కొనేవారికి ఫోన్లు చేసి, ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. అవసరమైతే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
మెడికల్ షాపు వారికీ పాజిటివ్..
లాక్డౌన్ కాలంలో ఒక్క మెడికల్ షాపుల మాత్రమే పనిచేస్తున్నాయి. దాంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారు ఎక్కువగా ఉంటున్నారు. సూర్యాపేటలోని మెడికల్ షాపులో ఒక వ్యక్తికి, మాదాపూర్లో ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.
Courtesy Andhrajyothi