– తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వీధి వ్యాపారులు
– సర్కారు ఇచ్చే రూ. 10 వేలు సరిపోయేనా..!
– లాక్డౌన్తో కనివినీ ఎరగని నష్టాలు..
– ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోని వ్యాపారాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లాక్డౌన్ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇదీఅదీ అనే తేడా లేకుండా అన్ని రంగాలూ లాక్డౌన్ దెబ్బకు కుదేలయ్యాయి. దీని కారణంగా రోడ్ల వెంబడి టీ కొట్టులు, చిన్న తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వారిపై పిడుగు పడినట్టుగా అయింది. టీ, కూరగాయలు, పండ్లు, దుస్తులు, గృహౌపకరణాలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ పొట్టపోసుకునే వీరంతా సుమారు ఆరు నెలలుగా వ్యాపారాలు లేక అల్లాడుతున్నారు. నష్టాలు భరించలేక, రుణాలు చెల్లించలేక చాలామంది అభాగ్యులు కుటుంబాలతో సహా తమ ప్రాణాలను బలి తీసుకున్న ఉదంతాలూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. మార్చిన మొదలైన లాక్డౌన్ నష్టాలు.. ఇప్పటికీ వీరిని వీడటం లేదు. అసంఘటితరంగ, దినసరి కూలీల మాదిరిగానే లాక్డౌన్కు వీరు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారు. అన్లాక్లు ప్రకటిస్తున్నా.. అసలింకా చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారాలు పూర్తి స్థాయిలో తెరుచుకోనే లేదు. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారుల అభ్యున్నతికని మోడీ సర్కారు తీసుకొచ్చిన నగదు ఆర్థిక సాయం… వారికి ఎంతమేరకు ఉపయోగపడుతుంది..? గతంలో ఈ చిరు వ్యాపారులకు బతుకునిచ్చిన వీధులు.. తిరిగి వారి జీవితాలకు భరోసా కల్పిస్తాయా..?
మెట్రో నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల స్థాయిలలో కలిపి దేశవ్యాప్తంగా రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకునే వారు నాలుగు కోట్ల వరకు ఉంటారని ఒక అంచనా. వీరంతా గుండు సూది మొదలు.. బ్రాండెడ్ వస్తువుల దాకా అమ్మకాలు జరుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఇక సుదూర ప్రాంతాల మధ్య నడిచే 20 వేల రైళ్ల ద్వారా సుమారు 50 లక్షలకు పైగా చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారని అంచనాలున్నాయి. అయితే ఒకరి మీద ఆధారపడకుండా.. స్వయం ఉపాధి పొందే వీరిని పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. పోగా, నగరాల్లో ‘వీరినొక సమస్య’గానే చూస్తున్నారు. వీరికోసం ప్రత్యేకమైన పథకాలు గానీ, ప్రోత్సాహకాలు గానీ ఏమీ లేవు. తాజాగా ఈ ఏడాది మోడీ సర్కారు ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్లో భాగంగా వీధి వ్యాపారులకు రుణం కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.
డిమాండే లేకుంటే రుణమెందుకు..?
లాక్డౌన్ కంటే ముందునుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోయినా.. కరోనా దెబ్బకు అది అధ:పాతాళానికి పడిపోయింది. పనుల్లేక ప్రజలంతా రోడ్డున పడ్డారు. అన్లాక్ల పేరిట క్రమంగా అన్ని తెరుస్తున్నామని సర్కారు చెప్పుకుంటున్నా.. ప్రజలకు పనిదొరకడం గగనమైంది. దీంతో వారి దగ్గర కొనుగోలు శక్తి మందగించింది. దీనికి తోడు లాక్డౌన్ తర్వాత అన్ని వస్తువులు, కూరగాయల రేట్లు భగభగమండుతున్నాయి. ఈ కారణాలతో ప్రజలు ఏదైనా కొనాలంటేనే వెనుకంజ వేస్తున్నారు. దీని ప్రభావం వీధి వ్యాపారుల మీద తీవ్రంగా పడుతున్నది. కొనుగోలు చేసేవాళ్లు లేక, అప్పులు తీసుకుని కొన్న సామాను అమ్ముడుపోక వారంతా రోజుల తరబడి వీధుల వెంబడి దిగాలుగా కూర్చుంటున్నారు. కొనుగోలుదారులలో కొనుగోలు శక్తి మందగించిన నేపథ్యంలో కేంద్ర సర్కారు అందించే రుణం తమకెలా ఉపయోగపడుతుందని నేషనల్ హ్యాకర్స్ (వీధి వ్యాపారులు) ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శక్తిమాన్ ఘోష్ అన్నారు. ఒకవేళ రుణాలు తీసుకున్నా.. వ్యాపారాలు లేకుంటే ఆ అప్పులను ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు.
ప్రధాన సమస్యలు
వీధి వ్యాపారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి రుణ లభ్యత. సాధారణంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేది పేద, మధ్యతరగతి ప్రజలే. అయినా వ్యాపారాలను మొదలుపెట్టడానికి కూడా వారి దగ్గర తగినంత నగదుండదు. దీనిని బ్యాంకులు, రుణదాతల ద్వారా తీసుకోవాల్సిందే. అయితే ఇది వారికి చాలా కష్టంతో కూడుకున్న పని. ఏదో రూపేణ అప్పు తీసుకొచ్చి వ్యాపారాలు ప్రారంభించినా.. మున్సిపాలిటీ అధికారులు, పోలీసుల వేధింపులు సరేసరి. వారు ఏర్పాటుచేసుకునే తోపుడు బండ్లను అక్కడనుంచి తొలగించాలనీ, సంబంధిత ప్రదేశంలో దాన్ని నిలపడానికి అనుమతి లేదనే సాకుతో వారి దగ్గర నిత్యం డబ్బులు గుంజుతున్నారు. ఎదురుతిరిగిన వారి బండ్ల సంగతి అంతే. వీధి వ్యాపారుల్లో చట్టబద్ధంగా మున్సిపాలిటీల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లు 25 నుంచి 30 శాతం మంది కూడా లేరు. ఇక చిరు వ్యాపారుల వద్ద ఏదైనా కొనుగోలు చేసేవారు కూడా వీరికి సరైన గుర్తింపునివ్వరు. మాములుగా పెద్ద పెద్ద దుకాణాల్లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు అక్కడ విక్రేతకు ఇచ్చే గౌరవంలో వీరికి ఇసుమంతైనా ఇవ్వరు. వారు చేసే వ్యాపారాలను బట్టి వారిని చిన్నచూపు చూస్తారు.
ఆన్లైన్ను తట్టుకుని నిలుస్తాయా..?
కరోనా తీసుకొచ్చిన భయాలతో బయట చిన్న వస్తువు కొనాలన్న జనాలు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న బడా కార్పొరేట్ సంస్థలు.. ఆన్లైన్ మార్కెట్లను తెరిచి పది రూపాయల వస్తువు నుంచి పది లక్షల రూపాయల వస్తువులనూ ఆన్లైన్ అంగట్లోనే అమ్ముతున్నాయి. వినియోగదారులు ఇంటినుంచి కాలు బయటపెట్టకుండానే.. ‘అన్నీ మీ గడపలోకే తీసుకొస్తాం’ అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటికి విపరీతమైన ప్రోత్సాహం కూడా అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మార్కెట్ల జోరును చిరు వ్యాపారులు తట్టుకుంటారా..? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
వారికి అనుసంధానిస్తేనే బతుకు : శక్తిమాన్ ఘోష్
వీధి వ్యాపారులకు మోడీ సర్కారు ఇచ్చే పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పెద్దగా ఉపయోగమేమీ లేదు. రైతులు పండించే కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులను వీధి వ్యాపారులకే ఇచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు గ్రామాల్లో తయారయ్యే బొమ్మలు, వస్త్రాలు, గృహావసరాల వస్తువులను తయారుచేసే వారితో వీరిని అనుసంధానిస్తే.. ఇరువురు లాభం పొందుతారు. వీటితో పాటు వీధి వ్యాపారులకు మున్సిపాలిటీ అధికారుల నుంచి వేధింపులు ఆపాలి. వారి వస్తువులు అమ్ముకోవడానికి నగరంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి.
Courtesy: NT