- భయపడదామా? పోరాడుదామా?
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ వ్యాఖ్య
- సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ: మమత
- ఉమ్మడి పోరాటమే శరణ్యం: సోనియా
- నేడు జీఎస్టీ మండలి కీలక భేటీ
- సెస్ రేట్లు పెంపు తప్పదా?
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లించడం కష్టమని కేంద్రం సంకేతాలివ్వడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీయడమేనని మండిపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ 41వ సమావేశం గురువారం జరగనున్న దశలో ఏడు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ అంశంపై తీవ్ర అసంతృప్తిని, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. జీఎస్టీ బకాయిల కోసం సమష్టిగా పార్లమెంట్లోనా, బయటా పోరాడాలని నిశ్చయించారు. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని కూడా సీఎంలు ఆలోచిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,65,302 కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం కొద్ది నెలల కిందటే చెల్లించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు విడతల పరిహారా న్ని మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ఆర్థిక మందగమనం, తగ్గిన రాబడితో రెవెన్యూ లోటు పెరగడం, కొవిడ్ను ఎదుర్కొనేందుకు ఇతర ఆర్థిక ఉద్దీపన చర్యలు తీసుకోవడం వంటి కార ణాలతో ఈసారి జీఎస్టీ బకాయి చెల్లించడం సాధ్యపడదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ పాండే గత నెలలో పార్లమెంటరీ స్థాయీ సంఘ సమావేశంలో చెప్పారు.
వసూళ్లు తగ్గినప్పుడు బకాయిలు చెల్లించనక్కరలేదన్న విషయం జీఎస్టీ నిబంధనావళిలో ఉందనిన్నారు. దీనిపై బుధవారం కాంగ్రెస్ నిర్వహించిన 7 విపక్షపాలిత రాష్ట్రాల సీఎంల సమావేశం తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించేందుకు నిరాకరించడం అంటే దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం వంచిస్తున్నట్లేనని సోనియా విమర్శించారు. కేంద్రాన్ని చూసి భయపడదామా.. పోరాడదామా.. మనమే తేల్చుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే అన్నారు. బెంగాల్కే కేంద్రం నుంచి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందని, ఇది రాకపోతే ప్రభుత్వాన్నెలా నడపగలమని మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ రాష్ట్రాల ఆర్థికస్థితి దయనీయంగా ఉందని అశోక్ గెహ్లోత్, జార్ఖండ్ సీఎం సొరెన్ అన్నారు.
సెస్ల పరిధిలోకి మరిన్ని వస్తువులు?
బకాయిలు చెల్లించాల్సిన పనిలేదని బుకాయిస్తున్నప్పటికీ కేంద్రం తన నైతిక బాధ్యతను విస్మరించజాలదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే 1. రాష్ట్రాలు మార్కెట్ నుంచి మరింతగా రుణం తీసుకోవడానికి అనుమతించడం 2. బకాయి సెస్సు కింద వచ్చే వస్తువు ల సంఖ్యను పెంచడం 3. సెస్సు రేట్లను పెంచడం 4. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ.. మొదలైనవి పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రాలు మార్కెట్ బారోయింగ్ పెంచుకుంటే భవిష్యత్తులో రాబడి ద్వారా కేంద్రమే చెల్లించాల్సి ఉం టుంది. మూలనిధిని పెంచడానికి మరో మార్గం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఇటీవల అన్నారు.
Courtesy Andhrajyothi