విశాఖపట్నం: శ్రీకాకుళంలో అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన మైనర్ దళిత బాలిక మరణించింది. 40 రోజుల పాటు మృత్యవుతో పోరాడి ప్రాణాలు వదిలింది. విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. తమ కూతురు చనిపోవడంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంతో మునిగిపోయారు. అయితే బాలిక చావుకు కారణం ఎవరు అనేది పోలీసులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తనపై పెట్రోల్ పోసి, నిప్పంచినట్టు బాలిక తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని హరిజనగెడ్డవీధిలో జనవరి 28న ఈ దారుణం జరిగింది. స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఆపోలు భువనేశ్వరిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలి ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు స్పందించారు. 50 శాతంపైగా కాలిన గాయాలతో ఉన్న బాలికను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో స్థానిక మేజిస్ట్రేట్ జి. స్వాతి సమక్షంలో బాలిక నుంచి వాంగూల్మాం నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం అక్కడికి నుంచి శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. పాలకొండ డీఎస్పీ పీఆర్ఆర్ ప్రసాద్ రాజాం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, తమ కుమార్తెను పాఠశాలలో ఎన్నో రోజులుగా ఇద్దరు బాలురు ఏడిపిస్తున్నారని, యాజమాన్యానికి తెలిసినా మందలించారు తప్పా తమ దృష్టికి తేలేదని బాలిక తల్లిదండ్రులు శంకర్రావు, లక్ష్మీ ఆరోపించారు. బాలిక పరిస్థితి విషమించడంతో వైజాగ్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు భువనేశ్వరి చనిపోయింది.
ఈ ఘటనపై సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 306 (ఆత్మహత్యకు ఉసిగొల్పడం) కింద కేసులు నమోదు చేసినట్టు రాజాం సిఐ సోమశేఖర్ తెలిపారు. నిందిత బాలుడు, 20 విద్యార్థులతో సహా ఇప్పటివరకు 7౦ మందిని ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామన్నారు. మృతురాలు, నిందిత బాలుడు ఒకే కులానికి చెందిన వారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.