అమరావతి: రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్ ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్, శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్రలకు వినతిపత్రం ఇచ్చింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వాలని, రాజధానికి భూములిచ్చిన దళిత రైతులకు కౌలు బకాయిలతో పాటు సమానప్యాకేజీ ఇవ్వాలని, డప్పుు కళాకారులకు గుర్తింపు కార్డులిచ్చి పెన్షన్ నమోదుకు ఆన్లైన్ సేవలు ప్రారంభించాలని, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్కు గతేడాది రుణాలు ఇవ్వాలని కెవిపిఎస్ నాయకులు మంత్రిని కోరారు.
సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కెవిపిఎస్ నాయకులకు మంత్రి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు. గతేడాది ఎసస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలపై ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై స్పష్టతనిస్తానని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఉపాధ్యక్షులు జి నటరాజ్, నాయకులు కృష్ణమోహన్, జి క్రాంతికుమార్, జి రవి, అడ్వొకేట్ వి రాజారత్నం తదితరులు ఉన్నారు.
చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం, ఏర్పేడు గ్రామంలో ప్రేమికులపై శుక్రవారం జరిగిన దాడిని కెవిపిఎస్ ఖండించింది. ఈ మేరకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అండ్ర మాల్యాద్రి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామానికి చెందిన మహేష్ (ఎస్సీ), స్నేహ (బిసి)లు పోలీసుల సమక్షంలో గురువారం కులాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్నేహ కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం సాయంత్రం మహేష్ ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారని పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై మహేష్ కుటుంబసభ్యులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని కెవిపిఎస్ ఖండించింది. చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ డిమాండ్ చేసింది.
Courtesy Prajashakathi…