* పుస్తక పరిచయ సభలో వక్తలు
పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దపు సామాజిక విప్లవకారుడని పలువురు వక్తలు కొనియాడారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో వీరబ్రహ్మం పుస్తక పరిచయ సభను ప్రజాశక్తి బుకహేౌస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి బుకహేౌస్ మేనేజర్ లక్ష్మయ్య సభాపరిచయం చేయగా, బుకహేౌస్ సంపాదకులు ఎస్ వెంకట్రావు అధ్యక్షత వహించారు. వెంకట్రావు అధ్యక్షోపన్యాసం చేస్తూ వీరబ్రహ్మం పుస్తకాలు, ఆయన ఆలోచనలు, భావజాలాన్ని సమాజంలో కిందిస్థాయి వరకు తీసుకెళ్లడమే ప్రజాశక్తి బుకహేౌస్ ధ్యేయమని అన్నారు. వీరబ్రహ్మం పుస్తకాల సంపాదకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 11 పుస్తకాలను పరిచయం చేసి, వాటి విశిష్టతను వివరించారు. పోతులూరి వీరబ్రహ్మంను ఈ సమాజం కాలజ్ఞానానికే పరిమితం చేయడం శోచనీయమని అన్నారు. వీరబ్రహ్మం సమాజంలో నెలకొన్న వివక్షలను, మత జాఢ్యాలను, మహిళల పట్ల నెలకొన్న చులకన భావాన్ని వ్యతిరేకించిన గొప్ప విప్లవకారుడని నేటి సమాజం గుర్తెరగాలని అన్నారు. వీరబ్రహ్మం రచనలు మధ్యయుగం నాటి అశాస్త్రీయ ఆలోచనలను తుడిచేయడానికి ఉపయోగపడతా యని అన్నారు. రచయిత డాక్టర్ యండపల్లి పాండురంగారావు మాట్లాడుతూ వీరబ్రహ్మం మతాలను, విగ్రహారాధనలను వ్యతిరేకిస్తే, నేటి సమాజం ఆయనకు గుడికట్టి, విగ్రహం పెట్టి ఆయన ఆశయాలు, భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. వీరబ్రహ్మం పుస్తకాన్ని ఆస్తిక, నాస్తిక దృష్టితో కాకుండా వాస్తవిక దృష్టితో రాశానని, అందుకే దీనికి డాక్టరేట్ లభించిందని వివరించారు. ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల ఆధారంగానే కాలజ్ఞానం రాసినట్లు వీరబ్రహ్మం తన రచనల్లో పేర్కొన్నారని గుర్తుచేశారు. సాహిత్య విమర్శకులు ఎం వీరాంజనేయులు మాట్లాడుతూ కుల వ్యవస్థ అనేది సమాజంలో ఉండకూడదని నేరుగా చెప్పిన వ్యక్తి వీరబ్రహ్మం అని అన్నారు. వీరబ్రహ్మం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జీవించారనడానికి ఆయన ఇల్లే నిదర్శనమన్నారు. ప్రముఖ రచయిత్రి మందరపు హైమావతి మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మం కవితలు, పద్యాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని, వాటిలోని పదాలకు పదునెక్కువుగా ఉంటుందని అన్నారు. వీరబ్రహ్మం విశేషాలు, జీవన స్థితి గతులను చదవడం మాత్రమే కాకుండా, ఆచరిస్తే సమాజం మెరుగువుతుందని అభిప్రాయపడ్డారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ మాట్లాడుతూ 400 సంవత్సరాల తర్వాత కూడా బ్రహ్మం చెప్పిన కుల, మత వ్యవస్థలు సమాజంలో కొనసాగడం బాధాకరమన్నారు. వీరబ్రహ్మం ఆలోచనలు, భావాలను ఈ పుస్తకాల ద్వారా విస్తృతంగా వ్యాపింపజేసేందుకు ప్రజాశక్తి నడుం బిగించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అభ్యుదయవాదులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
Courtesy Prajasakthi