– చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో పేదలు, మైనారిటీలపైనే కాకుండా పాత్రికేయులపైనా దాడులు పెరిగాయని తాజాగా విడుదలైన ఓ నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో 198 మంది జర్నలిస్టులపై దాడులు జరిగినట్టు థాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థ తన నివేదికను వెల్లడించింది. ఈ సంస్థ ప్రజారోగ్యం, సమాచార హక్కు, పౌరస్వేచ్ఛ వంటి అంశాల పరిరక్షణకు పనిచేస్తుంది. ఈ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేండ్లలో 40మంది జర్నలిస్టులు దాడుల్లో మరణించారు. వీరిలో 21మంది వారి వృత్తి సంబంధితదాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది 36మందిపై పాత్రికేయులపై దాడులు జరగ్గా, వారిలో ఏడుగురు మృతిచెందారని నివేదిక తెలిపింది. అయితే సర్కారు మాత్రం ఆంధ్రప్రదేశ్లో సత్యనారయణ అనే జర్నలిస్టు మాత్రమే చనిపోయారని చెబుతుండటం గమనార్హం. అయితే, ఈ దాడుల్లో ఎక్కువగా బలవుతున్నది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులేనని పేర్కొంది. దాడులు చేస్తున్న వారిలో మత మద్దతు దారులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, భద్రతా బలగాలు, పోలీసులు, లాయర్లు ఉన్నారని వెల్లడించింది. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలను చిత్రీకరిస్తున్న కొంతమంది జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసి, వారి కెమెరాలు, ఇతర పరికరాలు లాక్కున్న విషయం తెలిసిందే. అయితే, జర్నలిస్టులపై ఇన్ని దాడులు జరుగుతున్నా నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వందల సంఖ్యలో దాడులు జరుగుతుండగా, ఒకరిద్దరు నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంతో, ఈ నేరాలు మరింత పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
(Courtesy: NT)