హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాను కట్టడిచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా తగ్గముఖం పడుతోంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగురోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. శుక్రవారం కేవలం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆరు కేసులతో కలిపి మొత్తం 1044కు కేసుల సంఖ్య పెరిగింది. 552 మంది చికిత్స పొందుతున్నారని వైద్యులు చెప్పారు. శుక్రవారం 22 మంది కరోనా నుంచి కొలుకున్నారని, వారిలో వ్యాధి లక్షణాలు కనిపించపోవడంతో డిశ్చార్జ్ చేశామని వైద్యులు ప్రకటించారు. ఇప్పటివరకు 464 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఆరు రోజుల పాటు కరోనా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోయింది. ఉన్నట్టుండి గురువారం కేసుల సంఖ్య కాస్త పెరిగి.. 22 కేసులు నమోదయ్యాయి. అయితే తిరిగి గురువారం 22 కేసులు నమోదు కావడంతో ప్రజలు కాస్త ఆందోళన పడ్డారు. గురువారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు వైరస్ బారిన పడి చనిపోయారు. వీరంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వారే నమోదు కావడం గమనార్హం. అయితే ఈ రోజు తిరిగి సింగిల్ డిజిట్కే కరోనా కేసులు పడిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మరొక విషయం ఏమిటంటే కరోనా సోకే రోగులు సంఖ్య కంటే.. రోగం నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ వార్త ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపశమనం కల్గిస్తోంది.
Courtesy Andhrajyothi