బకాయిలు చెల్లించని విద్యుత్తు సంస్థలు
తెలంగాణ బాకీలు రూ.7,800 కోట్లు
5,600 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు
కార్మికుల జీతాలు చెల్లించడానికీ కటకటే
ప్రభుత్వాలకు ఐదేళ్లలో 27 వేల కోట్లు
పన్నులు చెల్లించిన సింగరేణి
తెలంగాణ ప్రజల కొంగు బంగారం సింగరేణి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా వివిధ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గును, రాష్ట్రంలోని ట్రాన్స్కోకు విద్యుత్తును విక్రయిస్తున్న సంస్థ ప్రస్తుతం నిధుల సమస్యను ఎదుర్కొంటోంది. రావాల్సిన బకాయిలు రూ.9,400 కోట్లకు చేరడంతో వేతనాలకు కూడా ఇబ్బందులు పడుతోంది. సింగరేణి కష్టాలకు తెలంగాణ విద్యుత్తు సంస్థలదే ప్రధాన పాత్ర. తెలంగాణ ట్రాన్స్కోనే సింగరేణికి రూ.5 వేల కోట్ల దాకా బాకీ ఉంది. జెన్కో రూ.2800 కోట్లు బకాయి పడింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంతో ఏపీ జెన్కో కూడా రూ.600 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంది. ఎన్టీపీసీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కూడా మరో వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉండటంతో ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టాయి. ఏటా దసరాకు ముందు లాభాల వాటాను కార్మికులకు ప్రకటించాల్సి ఉంటుంది. గతేడాది ఆగస్టు 28న కార్మికులకు లాభాల్లో 27ు వాటా ప్రకటించారు. ఈ ఏడాది వాటా ప్రకటిస్తే చెల్లించడానికి చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి నెలకొంది. 2018-19లో సింగరేణికి రూ.1,766 కోట్ల మేర లాభాలు వచ్చాయి. 30 శాతం దాకా లాభాల వాటా ప్రకటిస్తారని కార్మికులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. జీతాలకే ఇబ్బంది పడుతున్న తరుణంలో లాభాల వాటా ఎలా ఇవ్వాలన్నది సమస్యగా మారింది. మరోవైపు సింగరేణికి రెండు రోజుల కిందట 5600 కోట్ల బకాయిల చెక్కు ఒకటి ఇచ్చినట్లే ఇచ్చి, వెనక్కు తీసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వాలకు దండిగా సింగరేణి నిధులు
ఐదేళ్ల కిందట రూ.11,928 కోట్లుగా ఉన్న సింగరేణి టర్నోవర్.. ప్రస్తుతం రూ.25,687 కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.27,467 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105 కోట్లు, కేంద్రానికి రూ.14,362 కోట్లను చెల్లించింది. ఆరు సింగరేణి జిల్లాల్లో అభివృద్ధికోసం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎ్ఫటీ) కింద గత మూడేళ్లలో రూ.1,844 కోట్లను జిల్లా యంత్రాంగాలకు చెల్లించింది. ఆయా జిల్లాల్లో గ్రామాల అభివృద్ధికి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం ఈ నిధులతో చేస్తున్నారు.
తక్కువ ధరకే రాష్ట్రానికి విద్యుత్తు
రెండేళ్ల కిందట మంచిర్యాల జిల్లా జైపూర్లో ప్రారంభించిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం నుంచి సింగరేణి తక్కువ ధరకే రాష్ట్రానికి విద్యుత్ను అందిస్తోంది. యూనిట్ రూ.3.42లకే ఇస్తోంది. ధర చాలదని సింగరేణి ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునల్లో కేసు కూడా వేసింది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు యూనిట్ రూ.3.42కు కరెంట్ ఇస్తున్న సింగరేణి, తాను మాత్రం విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ను రూ.6.72కు కొంటోంది. ఆగస్టు నుంచి అమలవుతున్న ఎల్సీ(లెటర్ ఆఫ్ క్రెడిట్)లో విద్యుత్ సరఫరాకు చెల్లింపులు పొందే అవకాశం సింగరేణికిలేదు. డబ్బులు ఇవ్వకున్నా కరెంట్ తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటంతో సంస్థ నిండా మునిగే దశకు చేరింది. ఎల్సీ నిబంధన అమలైతే ఊరట లభించేదని కార్మికులు చెబుతున్నారు.
(Courtesy Andhrajyothi)