షాహీన్బాగ్… గత 50 రోజులుగా పత్రికల్లో, మీడియాలో తరచూ వినిపిస్తున్న పదం. ఢిల్లీలోని ఒక ప్రాంతానికి హఠాత్తుగా ఇంత పేరు ఎందుకొచ్చిందంటే… అక్కడ జరుగుతున్న నిరసన ప్రదర్శనలే కారణం. ‘పౌరసత్వ సవరణ చట్టం’ ఆమోదం తర్వాత వేలాది మహిళలు ఈ ప్రాంతంలో జరుపుతున్న నిరసనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. షాహీన్బాగ్ నుంచి ‘నవ్య’ గ్రౌండ్ రిపోర్ట్…
దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత సంపన్నులు నివసించే దక్షిణ ఢిల్లీ ప్రాంతమది… అపోలో ఆస్పత్రిని ఆనుకుని ఉన్న దారి నుంచి సరితా విహార్, జసోలా కాలనీలు దాటి ఓఖ్లా వైపు వెళుతుంటే అక్కడ కనబడుతుంది షాహీన్బాగ్. సందులు, గొందుల మధ్య వేలాది ఇళ్లు… చిన్న చిన్న స్కూళ్లు, మసీదులు… హైదరాబాద్లోని పాతబస్తీని తలపిస్తుంది. డిసెంబర్ 15న పార్లమెంట్ పౌరసత్వ చట్టం ఆమోదం పొందిందో లేదో ఈ ఇళ్లలోంచి ఒక్కసారిగా వేలాది మంది మహిళలు మెయిన్ రోడ్ వైపు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. అప్పటికప్పుడు శిబిరాన్ని నిర్మించారు. వాళ్లలో అన్ని వర్గాల వారు ఉన్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన ముస్లిం మహిళలు తమ నౌకర్లతో సహా అక్కడికి వస్తే చిరిగిన బురఖాలు ధరించిన పేద మహిళలు కూడా వారితో చేరారు. 90 ఏళ్లు దాటిన వృద్దుల నుంచీ పదేళ్ల బాలిక వరకూ వేలాది మంది అక్కడి నుంచి కదలబోమని భీష్మించుకుని కూర్చున్నారు. తెల్ల కపోతాల గురించి విన్నాం. రాచరికానికి చిహ్నంగా భావించే తెల్లటి డేగను ‘షాహీన్’ అంటారట. కానీ ఇవాళ షాహీన్బాగ్లో మహిళలు శాంతి కపోతాల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
షాహీన్బాగ్… ఇది ఇప్పుడు ఢిల్లీలో కేవలం ఒక ప్రాంతానికే పరిమితమయిన పదం కాదు. దేశంలోని నిరసన ప్రదర్శనలన్నింటికీ ఆదర్శంగా మారిన ప్రాంతం. తాము ఈ దేశాన్ని నమ్ముకున్నామని, ఈ దేశంపై తమకు నిజమైన భక్తి ఉన్నదని నిరూపించేందుకు వారు జాతీయగీతం జనగణమన, వందేమాతరంతో పాటు… ‘హోంగే ఖామియాబ్, సారే జహాసే అచ్చా’ గీతాలను పాడుతుంటే వేలాది గొంతులు ఆ పాటలతో ప్రతిధ్వనిస్తున్నాయి. మధ్యమధ్యలో ‘లేఖే రహేంగే ఆజాదీ’ (స్వాతంత్య్రం తీసుకుని తీరతాం) అన్న నినాదం ప్రతిధ్వనిస్తోంది. షాహీన్బాగ్లో అడుగుపెడితే అక్కడ అంతటా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ కనిపిస్తాయి. అక్కడి వేదికపై మహాత్మాగాంధీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సరోజినీ నాయుడు, జాకీర్ హుస్సేన్, అసఫుల్లా ఖాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో పాటు రాజ్యాంగ పీఠిక వేళాడుతూ కనిపిస్తుంది. తమను అభద్రతా భావానికి గురి చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి) ప్రతిపాదనను వెనక్కు తీసుకునేంతవరకూ తమ నిరసన ఆగదని వారు చెబుతున్నారు. దేశ చరిత్రలోనే వినూత్నమైన ఈ నిరసన ప్రదర్శన చుట్టూ ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏ క్షణంలోనైనా పోలీసులు ఈ శిబిరాన్ని తొలగిస్తారన్న వార్తలు వినపడుతున్నాయి. కాని షాహీన్బాగ్ మహిళలు మాత్రం చెక్కుచెదరడం లేదు.
భయం మమ్మల్ని వెన్నాడుతోంది…
ఈ దేశంలో ముస్లింలకు పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రధానమంత్రి, హోంమంత్రి పదే పదే ప్రకటిస్తున్నా వారు విశ్వసించడం లేదు. చట్టంలోనే ముస్లింలను పరిగణనలోకి తీసుకోబోమని ఉన్నదని, మత ప్రాతిపదికగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారని వారు చెబుతున్నారు. ‘ఈ చట్టం ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో మేము పౌరులమా? కాదా? అన్న భయాందోళనలు వెంటాడుతున్నాయ’ని అంటున్నారు. జాతీయ పౌర రిజిస్టర్ను ప్రవేశపెడతామని, అక్రమంగా ఈ దేశంలో ప్రవేశించిన వారిని ఏరి వేస్తామని రాష్ట్రపతి, హోంమంత్రి గతంలో హెచ్చరించారని వారు అంటున్నారు.
ఎన్నాళ్లు ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తార’ని అడిగితే సిఏఏ, ఎన్నార్సీపై ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకూ ఉంటామని, 2024 వరకు ఈ ప్రదర్శన జరపడానికైనా సిద్ధమేనని చెబుతున్నారు. ‘‘మోదీపై మాకు కోపం లేదు. మా జీవితాలు ఏమయిపోతాయోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఇళ్లలో ఉన్న మమ్మల్ని వీధుల్లోకి లాగింది వారే. మాకు సాంత్వన కల్పించాల్సింది పోయి వాళ్లు మమ్మల్ని భయపెడుతున్నారు. మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారు. ఎవరు రెచ్చగొట్టినా వారికి జవాబివ్వకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఒక మహిళ చెప్పింది. అయితే ఇది నిజాయతీగా జరుగుతున్న పోరాటం కాదని, కాంగ్రెస్ వాళ్లు చేయిస్తున్న పోరాటమని… కాదు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమిత్షా దీన్ని కొనసాగిస్తున్నారని… ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
రెండు నెలలుగా… రోడ్డు మీదే!
దేశవిదేశాలలో పలువురిని ఆకర్షిస్తున్న ఈ షాహీన్బాగ్ కథ ఏమిటి? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 11న పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సి.ఎ.ఎ) ఆమోదించింది. ఆ సవరణలను వ్యతిరేకిస్తున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. దాంతో, గత డిసెంబర్ 15 నుంచి షాహీన్బాగ్ ప్రాంతవాసులు పెద్ద సంఖ్యలో వీధిలోకి వచ్చి, నిరసనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు ప్రధానంగా పాల్గొంటున్న ఈ శాంతియుత నిరసన కార్యక్రమం ఇప్పటికి 50 రోజులకు పైగా నిర్విరామంగా సాగుతోంది. షాహీన్బాగ్ స్ఫూర్తితో గయ, ప్రయాగరాజ్, ముంబయ్, బెంగళూరు లాంటి పలు ప్రాంతాలలో కూడా ఈ తరహా నిరసనలు జరగడం విశేషం.
రాజ్యాంగమే ధైర్యాన్నిచ్చింది!
పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టిన తర్వాత తాము భారత రాజ్యాంగం చదువుకున్నామని, భారత రాజ్యాంగమే తమకు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ధైర్యాన్నిచ్చిందని ఒక విద్యార్థిని ప్రకటించింది. గాంధీజీ కొన్ని దశాబ్దాల పాటు స్వాతంత్య్రం కోసం పోరాడటం తమకు స్ఫూర్తినిచ్చిందని మరో విద్యార్థిని చెప్పింది. 50 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సరైన ప్రతిస్పందన రాకపోయినా సరే, షాహీన్బాగ్ మహిళలు వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. తమ గురించి దేశమంతటా తెలిసిపోయిందని, దేశంలోని మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే ఎలాంటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని వారు చెబుతున్నారు.
ఇదో వినూత్న పోరాటం… ఎముకలు కొరికే చలిలో కూడా మహిళలు, పిల్లలు ఇళ్లకు వెళ్లకుండా ప్రదర్శనలో పాల్గొనడమే వారి స్థయిర్యాన్ని తెలియజేస్తుంది’’ అని షాహీన్బాగ్లో ఉన్న ఒక యునానీ డాక్టర్ అన్నారు.
Courtesy Andhrajyothi