– ఎందుకలా…?
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 21 జరిగిన ఎన్నికల్లో లాతూర్, పలస్ కడెగావ్ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు మొదటిసారిగా ‘నోటా’ (పైవాటిలో ఏదీకాదు) బటన్కు రెండవస్థానం కట్టబెట్టారు. లాతూర్ గ్రామీణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్ముఖ్ 1, 35,006 ఓట్లను సాదించగా, నోటాకు 27,500 ఓట్లతో రెండోస్థానం లభించింది. అదేవిధంగా సాంగ్లి జిల్లాలోని పలస్ కడేగావ్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ దేశ్ముఖ్ 1,71,497 ఓట్లు సాధించగా, నోటాకు 20,631 ఓట్లతో ద్వితీయ స్థానం దక్కింది. దేశ ఎన్నికల చరిత్రలో నోటాకు రెండవస్థానం రావడం ఇదే మొదటిసారి. ఓటర్లు ఎందుకు నోటాను ఎంచుకున్నారు, దీని వెనుక రాజకీయం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లాతూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్ముఖ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారుడు. కాగా, 2017లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ధీరజ్ అదే ఏడాది జిల్లా పరిషత్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు అమిత్ 2009, 2014,2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన లాతూర్ అర్బన్ స్థానానికి పోటీపడ్డారు. 2014 ఎన్నికల్లో లాతూర్ రూరల్ నుండి బిజెపి అభ్యర్థి రమేష్ కరార్ గెలుపొందారు. అయితే ఈసారి కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని శివసేనకు కేటాయించింది. తమకు బలమైన పట్టువున్న ఔసా ప్రాంతాన్ని కాదని ఎన్నికల పొత్తులో భాగంగా లాతూర్ రూరల్లో పోటీ చేయాల్సి వచ్చింది. బిజెపి తన బలమైన కంచుకోటను శివసేనకు ఎందుకు అప్పగించిందనేది ప్రశ్నగా మిగిలింది. ఔసాలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహఖ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ బిజెపి అభిమన్యు పవార్పై పోటీ పడ్డారు. అభిమన్యు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఐదేళ్లపాటు ప్రత్యేక డ్యూటీ అధికారిగా పనిచేశారు. పఢ్నవీస్ ఆయనను ఎమ్మెల్యేగా చేయాలని భావించి, లాతూర్ సీటు కోసం యత్నించారు. అయితే ఆస్థానంలో థీరజ్ పోటీ చేయడంతో ఔసా ప్రాంతానికి మార్చారు. అయితే ఔసాలో కూడా గట్టి పోటీ ఎదురైంది. విలాస్రావ్ మృతిచెందడంతో ఆ ఓట్లన్ని ధీరజ్కు సానుభూతి ఓట్లుగా మారాయి. దీంతో మిగిలిన ఓట్లు నోటాను వరించడంతో రెండో స్థానానికి చేరుకుంది. పలాస్ కడేగావ్లో కూడా ఇదేవిధంగా జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదమ్ దివంగత పటాంగ్రావ్ కుమారుడు. 2018 ఉప ఎన్నికల్లో విశ్వజిత్ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆ సమయంలో కదమ్ ప్రత్యర్థి బిజెపి నేత సంగ్రామ్ దేశ్ముఖ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కదమ్ను కాంగ్రెస్ తరిమివేస్తే బిజెపిలో చేరతారని దేశ్ముఖ్ భావించాడు. అయితే ఈ నియోజకవర్గం కూడా ఎన్నికల పొత్తులో భాగంగా శివసేనకు కేటాయించారు. దీంతో శివసేన నుండి సంగ్రామ్ సోదరుడు పృధ్వీరాజ్ దేశ్ముఖ్ను బరిలోకి దించారు. విశ్వజిత్ లక్షా 62వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దేశ్ముఖ్ కుటుంబానికి మద్దతుదారులు నోటాను ఎంచుకోవడంతో రెండోస్థానం దక్కింది.
Courtesy Prajasakti..