ప్రొఫెసర్, పూర్వ ఎమ్మెల్సీ కే. నాగేశ్వర్
ఇంతటితో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం సరికాదు. WHO అభిప్రాయం ప్రకారం కోవిడ్ -19 వైరస్ సోకిన వారిలో 3-4 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కొన్ని దేశాలలో మరణించే వారి శాతం కొంచెం ఎక్కువుగా ఉండవచ్చు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కొత్తగా పుట్టే జీవులు, ముందే వున్న జీవుల తగ్గుదలకూ లేదా అంతానికి కారణం కావచ్చు. ఇది ప్రకృతిలో సాధారణం. మనుషుల వల్ల ఇప్పటికే చాలా జీవజాతులు అంతరించిపోయాయి. వైరల్ ఎపిడమిక్స్ మానవజాతి అంతానికి కారణం కాగలవని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే మానవ మేధస్సు వాటి ప్రభావాన్ని అడ్డుకోగలదు. రోజు రోజుకీ మనిషి మేధస్సుతో ఎంతో అభివృద్దిని సాధిస్తున్నాడు. ఈ అభివృద్దితో పాటు కొన్ని అనర్ధాలకూ కారణం అవుతున్నాడు. ఆ అనర్ధాల ప్రభావాన్ని తగ్గించే దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
కరోనా వైరస్ ను చైనా సృష్టించిందనీ, ఈ అనర్ధం వెనుక సైన్స్ పరిశోధనలే కారణమనీ ఆధారం లేని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మనం చరిత్రని చూస్తే ఇలాంటి మహమ్మారులు ఎన్నో పుట్టాయి! అసలు సైన్స్ అభివృద్ది చెందని కాలంలో ఎన్నో వైరసులు, బాక్టీరియాలు కోట్ల మంది మరణాలకు కారణమయ్యాయి. 1918 ప్రాంతంలో స్పానిష్ ఫ్లూ దాదాపు 5 కోట్ల మందిని హరించింది. 1346-53 ప్రాంతంలో ప్లేగు యూరోప్ లో 1/3 వంతు జనాభాని మాయం చేసింది. ఇలా మానవ చరిత్రలో ఎన్నో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మరులను మానవ సమాజం అడ్డుకోగలదా?
ఈ కోవిడ్-19 – శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఓ బలహీనమైన వైరస్. అందుకే మరణాలు 3-4 శాతం లోపే వుంటున్నాయి! ఒకవేళ ఇంతకన్నా బలమైన వైరస్ పుట్టి మరణాలు 30-40 శాతం ఉంటే? అది కరోనా కన్నా వేగంగా వ్యాప్తి చెందితే? వాటి ఇంక్యూబేషన్ సమయం కొన్ని గంటలు మాత్రమే అయితే? అది గాలి, నీరు ద్వారా వ్యాప్తి చెందితే? అది సోకిన మనిషి కేవలం కొన్ని గంటలలో మరణిస్తే? కొన్ని హాలివుడ్ సినిమాలలో మాదిరి మనుషులు జాంబిల్లా తయారయితే? ఇవన్నీ వూహలే కానీ అసంభవాలు మాత్రం కాదు. అయితే వీటికి మనిషి సిద్దంగా ఉన్నాడా? వాటిని ఎదుర్కోగలడా ? ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, స్పైయిన్ కరోనాతో తల్లడిల్లుతున్నాయి. ఇక ఆసియా, ఆఫ్రికా దేశాలలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి! మానవ జాతి ఇలాంటి విపత్తులని ఎలా ఎదుర్కోవాలి?*
ముందు విద్యా, వైద్యం పట్ల అన్ని దేశాల వైఖరీ మారాలి. జాతీయవాదం లాంటి సంకుచిత భావాలను విడనాడాలి. ప్రజల్లో జాతీయావాదాన్ని రెచ్చగొడుతూ తమ ఉనికి కోసం ప్రజాస్వామ్య నియంతల వైఖరిని ప్రజలు తిప్పి కొట్టాలి. రక్షణ రంగం మీద పెట్టే ఖర్చుని తగ్గించుకోవాలి. అయితే ఇవన్నీ అసాధ్యం అనుకోవచ్చు! కానీ మానవ ఉనికి కోసం ఇది జరగాలి.
తరువాత చెప్పుకోబోయేది ఎన్నో యేళ్లుగా మనిషిని అంధకారంలో ఉంచడానికి కారణం అవుతోన్న, సైన్స్ అభివృద్దికి విఘాతoగా ఉన్న, మనుషుల్లో మూఢత్వాన్ని పెంపొందిస్తున్న, మనుషుల్లో విచక్షణా జ్ఞానాన్ని అణచి సాటి మానవుల చావుకు కారణం అవుతున్న ‘మతం’. మనిషి సంఘజీవి గా ఉన్నప్పటి నుంచి ఈ మతం చేసిన అరాచకాలను ఒప్పుకోవడానికి ఏ మతానికీ ధైర్యం చాలదు. చేసిన తప్పులని ఆత్మవిమర్శ చేసుకునే నిజాయితీ అసలు లేదు. భారత్ లో అంటరాని తనానికి, కుల వ్యవస్థకి, పేదరికానికి, అజ్ఞానానికీ, యూరోప్ దేశాల్లో ఎంతో మంది శాస్త్రవేత్తల క్రూరమైన చావులకీ, ప్రస్తుత అరబ్ దేశాల్లో నియంతృత్వానికీ, తీవ్రవాదానికీ కారణమైనదీ ఇదే. మత మౌఢ్యం మనిషి పతనానికి ఏ రకంగా కారణం అవుతుందో చూద్దాం.*
కార్ల్ మార్క్స్ చెప్పిన సోమరి జాతుల్లో మత ప్రభోదకుల జాతి ఒకటి. వీళ్ళు దేశానికి గానీ, మానవ సమాజానికి గానీ ఎటువంటి శ్రమను, మూల ధనాన్ని గాని అందించకుండా శ్రమ జీవుల నుంచి దక్షిణలు, దశమ భాగాల పేరుతో శ్రమ దోపిడీకి పాల్పడతూ ఉంటారు. పైగా శ్రమజీవుల విశ్రాంతి దినాలనూ, సమయాన్నీ దోచుకుంటారు. ఇంకా కొందరు కొంచెం ముందడుగేసి పని చెడగొట్టే పనికిమాలిన ప్రబోధాలతో విలువైన జాతి సంపదకు గండి కొడుతున్నారు. పైగా వీరి దోపిడీకి ఎటువంటి పన్నులూ ఉండవు. చిన్న చిన్న గుడిసెల్లో, రోడ్డు పక్క గుడారాలతో ప్రారంభం అయ్యే వీరి ప్రస్థానం పెద్ద బంగాళాల్లో, ఖరీదైన కార్లలో, విమానాల్లో తుల తూగుతుంటుంది. పైగా వీరు విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టి, ప్రజల్లో సంకుచిత భావనలు నాటుతారు.
మత గ్రంథాల్లో ఉన్న అజ్ఞాన అంధకారం చాలదన్నట్టు కొత్త కొత్త భాష్యాలతో,సరికొత్త పూజలు, ప్రార్ధనలు, నూతన దుస్సంప్రదాయాలకు, విష బీజాలను ప్రజల మనసుల్లో ప్రతిష్టిస్తారు. పైగా తమ మత గ్రంథాల్లో సమస్త విజ్ఞానం ఉందనే అజ్జ్ఞానపు వాదనలతో మెదడుకు మేకులు కొడతారు! ప్రార్దనలు,యాగాలు, రకరకాల వికారపు విన్యాసాలు, భయానక భీభత్స ప్రసంగాలు, ఆశ్రమాల పేరుతో భూకబ్జాలు, చిన్న పిల్లల, సాయం కోరి వచ్చిన ఆడవాళ్ళ పై ఆఘాయిత్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే వీరి దుర్మార్గాలకి అoతులేదు. కొ(చె)త్త వైద్య ప్రక్రియలు కనిపెట్టి, అన్ని రోగాలనూ ప్రార్ధనలతో నయం చేస్తామని ప్రగల్బాలు పలికే మత బోధకులు ఈ కరోనా పై నోరు మెదపరు. కొన్ని రోజుల కిందటి చైనా క్రైస్తవుల్ని హింసిస్తుంది కాబట్టి అక్కడ కరోనా విజృభించింది అన్న మత ప్రబోధకుడు సెయింట్ పీటర్స్ చర్చ్ నెలవైన ఇటలిలో ఎందుకు విజృభిస్తుందో సమాధానం చెప్పడు. బాలాజీ దయ వల్లే భారత్ లో కరోన లేదన్న పూజారులు కరోనా ప్రభావంతో సదరు గుడినే ఎందుకు మూసేశారో చెప్పడు. అన్ని శాస్త్ర సాంకేతిక విశేషాలూ తమ మత గ్రంథాల్లో ఉన్నాయని డప్పు కొట్టుకేనే వాళ్ళు ఈ కరోనా కి మందు కనిపెట్టి, నోబెల్ ప్రైజ్ ని వాళ్ళ దేవుడికి అంకితం చెయ్యొచ్చు కదా. కరోనా తగ్గడానికి కొత్త యోగాసనం కనిపెట్టి వాళ్ళ దేవుడి పేరుతో పేటెంట్ తీసుకోవచ్చు కదా? ఇవేమీ చేయలేరు.
సామూహిక ప్రార్ధనలు, హిస్టీరియా ఏడుపులు, పొర్లు దండాలు, తెల్లవారు జాము మైకు గోలలు, ఇవేమీ వైరస్ ల నుండి కాపాడలేవు. దేవుడి పేరుతో చేసే రికార్డింగ్ నృత్యాలు, పబ్లిక్ న్యూసెన్సు. పెద్ద స్పీకర్లు పెట్టి మరీ ఏడ్చే ఏడుపులే కదా వీరు చేసే దైవ కార్యాలు. ఈ పిచ్చి ఇంకా విస్తృతమయి, తమ దేవుడే నిజమైన దేవుడని వాదిస్తారు! మత మార్పిడులు, మారని వారి పై దాడులు, ఇది ఇంకా ముదిరి తీవ్రవాదం చోటుచేసుకుంటుంది. ఈ తీవ్రవాదం వల్ల మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు తెలియనివి కాదు. ఇదే ప్రస్తుతం అభివృద్ది తీవ్ర ఆటంకం. నాస్తికులు అత్యధికంగా ఉన్న దేశాలైన నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మానవాభివృద్ది, సంతోషకర దేశాల సూచికల్లో ముందున్నాయి. దాదాపు ఆస్తికులదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా మరియు ఆఫ్రికా దేశాలు ఎందుకు వెనుకబడ్డాయి? పైగా నేరనార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చాలా తక్కువగా ఉంది. దీన్ని బట్టి మతానికీ నైతికతకూ ఎలాంటి సంబంధం లేదు. మతం మనకు ఎలాంటి నైతికత నేర్పుతుంది అనే విషయం పై రిచర్డ్ డాకిన్స్ అనే రచయిత గాడ్ డేల్యూజన్ అనే పుస్తకంలో చక్కగా వివరించారు.
ఇప్పటికైనా అజ్ఞానాన్ని విడిచిపెట్టి విలువైన సమయాన్నీ, డబ్బునూ, జనం విద్య – వైద్యానికి ఖర్చు పెట్టండి లేదా మదుపు చేయండి . ప్రభుత్వాలు కూడా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పు బెల్లాల్లా పంచి పెట్టకుండా విద్యా, వైద్యానికీ సరైన కేటాయింపులు చేయాలి. మతం పేరుతో తిరిగే సోమరిపోతుల ఆదాయాన్ని టాక్స్ పరిధిలోకి తీసుకురావాలి. కాలు కదపకుండా ప్రజల దక్షిణల, దశమ భాగాల, కానుకలతో జల్సా చేసే వాళ్ళను ప్రజలు గుర్తించాలి! వారికి శ్రమ విలువ తెలియచేయాలి. ప్రజలు హేతువాదంతో, తర్కంతో కూడిన ఆలోచనలతో,, ప్రశ్నిoచే స్వభావాన్ని కలిగివున్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అప్పటి వరకూ ఈ సోమరిపోతులు సామాన్యుల అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని వారిపైనే స్వారీ చేస్తూ ఉంటారు .