- కార్పొరేట్ దోపిడీ క్విట్ ఇండియా
- మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై మార్మోగిన నినాదాలు
- సేవ్ ఇండియా డేలో కోటి మంది భాగస్వామ్యం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ”ఇండియా నాట్ ఫర్ సేల్”, ”కార్పొరేట్ దోపిడీ క్విట్ ఇండియా” నినాదాలు మారుమోగాయి. ‘క్విట్ ఇండియా దినోత్సవం’ సందర్భంగా ‘సేవ్ ఇండియా డే’ని ట్రేడ్ యూనియన్లు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో రైతులు గ్రామ స్థాయిలో ఈ ఆందోళనల్లో పాల్గన్నారు. పలు రాష్ట్రాల్లో ఆందోళనల్లో పాల్గన్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. త్రిపుర రాజధాని అగర్తలలో సత్యాగ్రహంలో పాల్గన్న మహిళా కార్మికులను అరెస్టు చేశారు.
ఢిల్లీలో వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్, ఐఎన్టియుసి ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్, ఎఐయుటియుసి జాతీయ కార్యదర్శి ఆర్కె శర్మ, ఎల్పిఎఫ్ జాతీయ నేత జవహర్ సింగ్, ఎఐసిసిటియు జాతీయ నేత రాజీవ్ డిమ్రీ తదితరులు ప్రసంగించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల్లో పెరుగుతున్న ఐక్యతకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమాజంలోని ఇతర వర్గాలను పోరాటాల్లోకి తీసుకురావాలని నేతలు పిలుపునిచ్చారు. ఈనెల 7, 8 తేదీల్లో స్కీం వర్కర్ల సమ్మె విజయవంతమైందన్నారు. ప్రతిఘటన, ధిక్కరణ పిలుపునకు ప్రజలందరి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. బలమైన కార్మిక, రైతు కూటమి శ్రామిక ప్రజల ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందన్నారు. సిఐటియు అధ్యక్షురాలు కె.హేమలత, జాతీయ నాయకులు ఎంఎల్ మాల్కోటియా, జెఎస్ మజుందార్, ఎస్ దేవ్రారు, ఎఆర్ సింధు, అమితావా గుహా తదితరులు పాల్గన్నారు.
‘సేవ్ ఇండియా డే’ పిలుపులో భాగస్వామ్యమైన ఆల్ ఇండియా కిసాన్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎఐకెసిసి) కన్వీనర్ విఎం సింగ్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, బీమా, బ్యాంక్, డిఫెన్స్, రైల్వే తదితర సంఘాల నాయకులు పాల్గన్నారు. ఢిల్లీలో సమ్మె చేస్తున్న ఆశా కార్మికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. ముంబయిలోని చారిత్రాత్మక ఆజాద్ మైదానంలో కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త సమీకరణ జరిగింది. వివిధ రాష్ట్రాల్లో యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యారు.
Courtesy Prajashakti