-సరైన రక్షణ లేక వైరస్ ముంగిట వారియర్స్
– మొదట్లో అందజేసి తర్వాత గాలికొదిలేసిన అధికారులు
– పాజిటివ్ బారిన పలు పారిశుధ్య కార్మికులు
– వైద్య సహాయం అందించడంలోనూ నామమాత్రమే
– ఎప్పటికప్పుడు టెస్టులు చేయకపోవడంతో ఆందోళన
మొఫిసిల్ యంత్రాంగం: అయినవారే రాకపోయినా మృతదేహాల్ని ముట్టుకుని గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసేదీ వారే. అందరి రక్షణ కోసం పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతున్నదీ వాళ్లే. ప్రజలంతా ఇండ్లలో ఉండిపోతే తమ ప్రాణాలను పణంగా పెట్టి గల్లీగల్లీల్లో గంటల కొద్ది తిరిగి పోరాడిందీ వాళ్లే. కానీ కరోనా వస్తే ఎక్కడ కుటుంబానికి అంటుకుంటుందో నని క్షణక్షణం భయంభయంగా.. కనీస రక్షణ లేకుండానే వైరస్ నివారణకు ముందుండి పోరాడుతున్నారు. కనీస రక్షణగా మాస్కు, గ్లౌజులు, శానిటైజ్, బూట్లు వంటి పరికరాలు కూడా వారికి సక్రమంగా అందడం లేదు. ఇప్పటికే పలువురు కరోనా బారినపడి హోం ఐసోలేషన్లో ఉండగా.. మెరుగైన వైద్యం, పౌష్టికాహారానికీ వారు నోచుకోవడం లేదు. కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న మున్సిపల్ కార్మికులకు రక్షణ కరువైంది. లాక్డౌన్ సమయంలో మార్చి, ఏప్రిల్ ఒకట్రెండుసార్లు మాత్రమే ఒకటి లేదా రెండుచొప్పున మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, సబ్బులు అందజేశారు. ఉధృతి పెరిగిన తర్వాత మాత్రం ఆ విషయాన్ని అధికారులు మర్చిపోయారు. కంటైన్మెంట్ జోన్లతో పాటు అన్నిప్రాంతాల్లో నిరంతరం పనిచేసిన వారికి రక్షణ లేకుండా పోయింది. అడపాదడపా స్వచ్ఛందసంస్థలు, కొందరు దాతలు ఇచ్చివాటితోనే నెట్టుకొస్తున్నారు. మెజార్టీ ప్రాంతాల్లో శానిటైజర్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామాల్లో ఇతరులు ఇచ్చిన మాస్కులు, గ్లౌజులనే వాడుతున్నారు. కొన్ని జిల్లాల్లో పీపీఈ కిట్లు పోలిన డ్రెస్సులు ఒకసారి మాత్రమే అందజేయగా.. ఇంకొన్ని జిల్లాల్లో మాత్రం ఆ డ్రెస్సులు కూడా ఇవ్వలేకపో యారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని వైరా మున్సిపాల్టీలో 34 మంది పారిశుధ్య కార్మికులుండగా.. 10 మందికి మాత్రమే గ్లౌజులిచ్చారు. ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. జూన్లో లయన్స్క్లబ్ అందజేసిన రక్షణ పరికరాలే దిక్కయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు పంచిన మాస్కులు తప్ప మున్సిపల్ నుంచి ఇవ్వలేదని కరీంనగర్ కార్మికులు ‘నవతెలంగాణ’తో చెప్పారు. మల్టీ విటమిన్ మాత్రలు సైతం ఇవ్వడం లేదు. మణుగూరు మున్సిపాల్టీలో రెండు నెలలుగా ఎటువంటి రక్షణ పరికరాలు ఇవ్వలేదంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కసారి మాత్రమే రెండు మాస్కులు, 50 మిల్లీలీటర్ల సానిటైజర్ డబ్బా ఇచ్చారు. కొన్నిచోట్ల మాస్కుల్లేకుండానే కార్మికులు పనిలో కనిపిస్తుండగా.. మరికొందరు సొంత డబ్బులతో సానిటైజర్లు, ఫేస్షీల్డులు కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. కామారెడ్డిలో కార్మికుల దీనావస్థ చూసి ఆ జిల్లా ఎస్పీ శ్వేత ప్రత్యేకంగా మాస్కులు, రక్షణ పరికరాలు పంపిణీ చేశారు.
తొలగిస్తామని హెచ్చరికలు
మున్సిపాలిటీల్లో కార్మికుల కొరత వల్ల ఉన్నవారిపై అదనపు భారం పడుతుండగా.. విధుల్లోకి రాకపోతే కొన్నిచోట్ల తొలగిస్తామనే హెచ్చరికలు జారీచేస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి మున్సిపాల్టీలో వార్డుకు 10మంది చొప్పున కార్మికులుండాల్సి ఉండగా సగం మందితోనే పనులు నెట్టుకొస్తున్నారు. బెల్లంపల్లిలో పారిశుధ్య పనుల కోసం రోజు కూలీలుగా రోజుకు రూ.200 ఇచ్చి పెట్టుకున్నారు. వారికీ ఎలాంటి రక్షణ పరికరాలూ ఇవ్వలేదు. కేవలం మాస్కులు ధరించి పనులు చేస్తుండటంతో లక్ష్మీ అనే మహిళా కార్మికురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో పంపు ఆపరేటర్కు కరోనా ప్రబలడంతో హోం కార్వంటైన్లో ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో పీపీఈ కిట్లు లేకుండానే పనిచేయడంతో చొప్పదండి మున్సిపాల్టీలోని ఓ కార్మికుడికి పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లోనే ఉండాలని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. రంగారెడ్డి మున్సిపాలిటీ నార్సింగి పరిధిలో నలుగురు కార్మికులు చికిత్స పొంది ఇంటికి వచ్చారు.
కరోనా విజృంభణతో విధుల్లోకి వెళ్లాలంటే భయమేస్తోందని వారు చెబుతుండగా.. పనుల్లోకి రాకుంటే తొలగిస్తామని అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని వర్ధన్నపేట మున్సిపాల్టీలో విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు. కార్మికులకు ప్రతివారం టెస్టులు చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. 20మందికిపైగా కార్మికులు కరోనా బారినపడ్డా రక్షణ విషయంలో అలసత్వం కొనసాగుతోంది. ముషీరాబాద్ సర్కిల్ పరిధిలో ఒకేసారి 100-150 మిల్లీలీటర్ల శానిటైజర్ బాటిల్ మాత్రమే అందజేశారని చెబుతున్నారు. అయితే కరోనాతో మరణించిన పారిశుధ్య కార్మికునికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రకటించినా ఏప్రిల్, మే, జూన్ నెలల నిబంధన గడిచిపోయింది. ఈ ఉధృతి సమయంలో దాన్ని పొడిగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం రూ.12వేల వేతనం చెల్లించాలని డిమాండ్ వస్తోంది.
సన్మానం, కాళ్లు కడిగితే ఏం లాభం? : పాలడుగు భాస్కర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రజల ప్రాణాలను రక్షించేవారికి ఏమాత్రం రక్షణ లేదు. స్వీయనిర్బంధం మంత్రాన్ని ప్రజాప్రతినిధులు, ధనికులు తూచతప్పకుండా పాటిస్తున్నా.. పారిశుధ్య కార్మికులకే వర్తించకుండాపోయింది. సొంతవాళ్లే ముందుకురాని సమయంలో మృతదేహాలను తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేస్తున్నారు. కార్మికులకు ఆత్మస్థైర్య కలిగించేలా చర్యలు తీసుకోవాలి. సన్మానాలు చేసి, కాళ్లు కడగడంతోనే సరిపెడితే ఏం లాభం? టెస్టులు చేయడంతో పాటు కరోనా సోకిన కార్మికులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందజేయాలి. రూ.5 వేలు కాకుండా రూ.25 వేల ఇన్సెంటివ్ అందజేయాలి.
Courtesy Nava telangana