చేబదుళ్లతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ కార్మికులు
అప్పు పుట్టని వారి అవస్థలు అనేకం
ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, నిత్యావసరాలకు కటకట
ఆర్టీసీ కార్మికుల అర్ధాకలి కేకలు
పరిష్కారం ఎప్పటికో!
ప్రగతి చక్రాలపై నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు పరుగులు తీయించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు అచేతనంగా మిగిలారు. సమ్మెలో ఉన్న వారి కుటుంబాలు అర్ధాకలితో పస్తులుంటున్నాయి. కార్మికులు విధులకు దూరమై 51 రోజులు గడిచిపోయాయి. మళ్లీ విధుల్లోకి వెళ్లగలరో లేదో తెలియదు. ఒక్క నెల జీతం రాకపోతేనే విలవిలలాడే బతుకులవి. ఏకంగా రెండు నెలలుగా జీతాల్లేక జేబులు నిండుకున్నాయి. చేబదుళ్లతో నెట్టుకొస్తున్నారు. అవి కూడా దొరకని వారు సొమ్ములు లేక సొమ్మసిల్లుతున్నారు. ఒకవైపు ఆత్మహత్యలు, మరోవైపు దిగులు మరణాలతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు ఆవరించాయి. ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, పాలు, వెచ్చాలు… ఇలా దేనికీ డబ్బుల్లేవు. అప్పులిచ్చేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం అన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. నవంబరు కూడా గడిచిపోతుండడంతో సగటు కార్మికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల ఐకాస ప్రకటించి నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించలేదు. కార్మికుల ఆత్మహత్యలు, జీతాల చెల్లింపు వ్యవహారాల్లో హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు కొలిక్కి వచ్చాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగంలోకి ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా? అని కార్మికులు ఎదురు చూస్తున్నారు.
పిల్లల చదువులు ఆగిపోయాయి – ఎం.పుష్పలత, కండక్టర్, వరంగల్ డబ్బుల్లేక పిల్లల ఫీజులు చెల్లించలేకపోయాం. ఇద్దరు పిల్లలూ దసరా సెలవుల తరువాత నుంచి కాలేజీలకు వెళ్లట్లేదు. చదువులు ఆగిపోయాయి. చిరుద్యోగైన నా భర్త జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. రెండు నెలలుగా ఇంటి అద్దె తదితరాలేవీ చెల్లించలేదు. ఉద్యోగం ఏమవుతుందోనన్న ఆందోళనతో నాకు అనారోగ్యం సోకితే… వైద్యానికి రూ. అయిదు వేలు ఖర్చయ్యింది. మళ్లీ ఉద్యోగంలోకి వెళ్తామా? జీతం వస్తుందా? అనే ఆందోళనతో ఉన్నాం. |
నలుగురూ నవ్వినా… పత్తి చేలో పనిచేస్తున్న ఈయన కూలీ అనుకుంటున్నారా? కానే కాదు. ఆర్టీసీ డ్రైవర్గా నూతనకల్లో పనిచేస్తున్నారు. పేరు వెంపళ్ల కోటిరెడ్డి. ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు.. రెండు నెలలుగా జీతాల్లేవు. ఇంటి ఖర్చులకే కటకటగా ఉంది. ఇక అప్పుల కిస్తీలు చెల్లించే దారి ఏదీ? చేసేది లేక ఈయన పత్తి తీసేందుకు కూలి పనికి వెళుతున్నారు. ‘ఉద్యోగం చేస్తూ కూలికి వెళ్లడమేంటని కొంత మంది నవ్వుతున్నారు. కానీ డబ్బుల్లేకుంటే నవ్వులపాలవ్వాల్సి వస్తుందిగా. అందుకే సిగ్గు పడట్లేదు. నేనేం తప్పు చేయట్లేదు. కుటుంబాన్ని పోషించుకునేందుకు కాయకష్టం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు కోటిరెడ్డి. |
జీతం లేక… జీవితం దక్కక.. నాగేశ్వర్ అనే కండక్టర్ ఇటీవల మనోవేదనతో మృతి చెందారు. ఆయన భార్య సుజాత, ఇద్దరు కుమారులు వీరు. తన భర్త దూరమైన వైనాన్ని సుజాత కన్నీళ్లతో ఏకరువు పెట్టారు… ‘ఉద్యోగం ఉంటుందా? లేదా? అన్న మనోవేదనతో ఆయన మంచాన పడ్డారు. నిద్రలో టికెట్…టికెట్ అని కలవరించేవారు. నారాయణ్ఖేడ్లో ఉండేవాళ్లం. జీతం లేక జోగిపేటకు మకాం మార్చాం. ఆయనను తార్నాక ఆస్పత్రికి తీసుకెళ్తే సమ్మెలో ఉన్నందున వైద్యం చేయబోమన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేర్చితే రెండు రోజులకు చనిపోయారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే యూనియన్ నాయకులు సాయం చేశారు. నేను, ఇద్దరు కుమారులు రోడ్డున పడ్డాం. చదువు మానేసిన కొడుకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు’ అని వాపోయారు. |
బంధువుల సాయంతో నా కుమార్తె బతికింది – కె.కరుణకుమార్, డ్రైవర్, సంగారెడ్డి రెండు నెలలుగా జీతాల్లేవు. బీటెక్ చదువుతున్న మా అమ్మాయికి డెంగీ జ్వరం వచ్చింది. రూ. 3.80 లక్షలు ఖర్చయ్యాయి. అన్ని డబ్బులు నా దగ్గర లేవు. నా భార్య వద్ద ఉన్న బంగారు వస్తువులు కుదువ పెట్టినా డబ్బులు చాలలేదు. అదృష్టం కొద్దీ బంధువులు తలా కొంత ఆర్థిక సహాయం చేయటంతో వైద్యం చేయించి నా కుమార్తెను బతికించుకోగలిగాను. |
‘పాత’ వృత్తితో భుక్తి… ‘పాత సామాన్లు కొంటాం’… అంటూ వీధివీధినా తిరుగుతూ పొట్ట పోసుకుంటున్నారీయన. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఈయన అసలు వృత్తి అది కాదు. బాన్సువాడలో ఆర్టీసీ కండక్టరుగా పనిచేస్తున్నారు. పేరు కె.శ్రీరాములు. బస్సులో టిక్కెట్ టిక్కెట్ అంటూ ఉద్యోగం చేయాల్సిన ఈయన ఇలా డొక్కు మోపెడ్పై తుక్కు సామాన్లు అమ్ముకోవాల్సి వచ్చింది. 51 రోజులకు పైగా సాగుతున్న సమ్మె నేపథ్యంలో జీతం రాక ఇల్లు గడవట్లేదు. మరో పని చేతకాదు. ఉద్యోగం రాక ముందు చేసిన పాత సామాన్ల వ్యాపారమే ఈ కష్టకాలంలో అన్నం పెడుతోందని ఆయన దీనంగా చెప్పారు. ‘వీధుల్లో తిరుగుతూ ఇనుప తుక్కు సామానులు కొని, వేరే దుకాణాల్లో అమ్ముతున్నాను. రోజుకు రూ. రెండు వందలు వస్తున్నాయి. తిండిఖర్చుల వరకు తేగలుగుతున్నా. అంతకు మించి ఏమీ చేయలేని స్థితి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు శ్రీరాములు. |
దాతలిచ్చిన సరుకులే గతి – కోడి అలివేలు, కండక్టర్, కొత్తగూడెం జీతం లేదు. దాచుకున్న కాస్త సొమ్మూ భర్త వైద్యానికి అయిపోయింది. కుటుంబం గడవటం కష్టంగా మారింది. చెవి దిద్దులు కూడా అమ్మాను. కొందరు దాతలు సమ్మెలో ఉన్న 75 మంది కార్మికులకు బియ్యం, పప్పు, ఉప్పులతో కూడిన సరుకులు ఇచ్చారు. మా కుటుంబ స్థితి తెలిసిన కొందరు ఉద్యోగులు తమ సరుకులు కూడా మాకే ఇచ్చారు. వాటితోనే నెట్టుకొస్తున్నాం. భవిష్యత్తుపై భయంగా ఉంది |
Courtesy Eenadu