– రూ.68వేల కోట్లపైగా మాఫీ చేసిన ఆర్బీఐ
– పీఎన్బీ కుంభకోణం నిందితుడు చోక్సీ అప్పులు కూడా..
ముంబయి : బడాబాబుల వేలకోట్ల రుణాలను ఆర్బీఐ రద్దు చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలు రుణాలను చెల్లించలేకపోతే ముక్కు పిండి వసూలు చేయడమే గాకుండా ఆస్తులను జప్తు చేస్తుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాలు మాత్రం బడాబాబులకు వర్తించడం లేదు. 2019 సెప్టెంబర్ నాటికి వ్యాపారవేత్తలకు సంబంధించి రూ.68 వేల కోట్ల పైగా రుణాలను రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. 2020 ఫిబ్రవరి 16 నాటికి టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణస్థితికి సంబంధించిన వివరాలను కోరగా.. ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే తెలిపారు. ఆర్బీఐ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఉద్దేశపూర్వక టాప్ 50 మంది ఎగవేతదారులకు సంబంధించిన రూ.68,607 కోట్ల రుణాలను ఆర్బీఐ పూర్తిగా రద్దు చేసింది. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయినా మెహుల్ చోక్సీ అప్పులు కూడా ఉన్నాయి. రద్దయిన రుణాల్లో చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5,492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజరు ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్ఎంసీజీ సంస్థ ఆర్ఇఐ ఆగ్రో లిమిటెడ్ రూ. 4314 కోట్లు, జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ రూ.4,076 కోట్లు చొప్పున చెల్లించాల్సి
ఉండగా ఆ మొత్తాలను మాఫీ చేసింది. ఈ సంస్థలు తొలి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రయివేట్ లిమిటెడ్కు చెందిన రూ.2,850 కోట్ల రుణాలను రద్దు చేసింది. బాబా రామ్దేవ్ బాలకష్ణ గ్రూప్ కంపెనీ కొనుగోలు చేసిన రుచి సోయా ఇండిస్టీస్ లిమిటెడ్కు చెందిన రూ.2,212 కోట్లు రద్దు చేసింది. జూమ్ డెవలపర్స్ కంపెనీ రూ.2,012 కోట్లు, విజరు మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన రూ.1,943 కోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. కాగా విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిరాకరించిందని గోఖలే తెలిపారు.
Courtesy: NT