ఫడణవీస్ ప్రమాణ స్వీకారంపై భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సాక్షాత్తూ భాజపా సీనియర్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమయింది. కర్ణాటకకు చెందిన భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఫడణవీస్ 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి చేతిలో రూ.40వేల కోట్లు ఉన్నాయి. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి వస్తే ఈ నిధులు దుర్వినియోగమవుతాయని భావించి కేంద్రం వాటిని వాపసు తీసుకోవాలని అనుకొంది. అందుకే ఫడణవీస్ను ముఖ్యమంత్రిగా నియమించి, ప్రమాణ స్వీకారం చేసిన 15 గంటల్లోనే ఆ పనిని పూర్తి చేసింది’’ అని చెప్పారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు.. మహారాష్ట్రకు ఇచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసుకోవడమేమిటంటూ మండిపడ్డాయి.
అలాంటిదేమీ లేదు: ఫడణవీస్
ఈ వ్యాఖ్యలను ఫడణవీస్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అడగలేదని, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయినీ వాపసు చేయలేదని స్పష్టం చేశారు. అసలు తాను ఆ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కేంద్రం వాపసు తీసుకొనే అవకాశం కూడా లేదని చెప్పారు.
Courtesy Eenadu…