- రేప్నకు గురై ఆత్మహత్య చేసుకున్న బాలిక
- నిందితుడి తరపున గ్రామపెద్దల వకాల్తా
- మృతురాలి తండ్రికి 5లక్షలిచ్చ్చేలా ఒప్పందం
ఊట్కూర్/మహబూబ్నగర్ : అత్యాచారానికి గురైన ఆ బాలిక అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. మైనర్పై అత్యాచారం జరిపిన మృగాడికి శిక్ష వేయించాల్సిన గ్రామపెద్దలే బాలిక ప్రాణానికి వెల కట్టారు. నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకుని.. రూ.5లక్షలకు బాలిక తండ్రిని ఒప్పించారు. ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని ఏర్గాట్పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచిమహబూబ్నగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మృతిచెందింది.
గ్రామానికి చెందిన బాలప్ప తనపై అత్యాచారం చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు బాలిక తెలిపింది. కాగా.. మంగళవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. చట్టపరంగా నిందితుడిని పోలీసులకు పట్టించాల్సిన గ్రామపెద్దలు.. బాలప్ప తరఫున రంగంలోకి దిగారు. సర్పంచ్ తండ్రి బాలకిష్టయ్య, నిందితుడి తండ్రితోపాటు గ్రామ పెద్దలు బాధితురాలి తండ్రిని రూ.5 లక్షలు పరిహారం తీసుకునేందుకు ఒప్పించారు.
మందలించినందుకేనని ఫిర్యాదు
తన కూతురు బాలప్పతో సన్నిహితంగా ఉండటాన్ని తెలిసి తాము మందలించినందుకే ఆత్మహత్య చేసుకున్నదని పోలీసు ఫిర్యాదులో పేర్కొనాలని, అత్యాచారం జరిగిన విషయం ఎక్కడా చెప్పరాదంటూ మృతురాలి తండ్రిని ఒప్పించారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఈ పంచాయితీ నడిచింది. అనంతరం.. ఒప్పందం మేరకు మృతురాలి తండ్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలప్పతో చనువుగా ఉంటున్న కారణంగా మందలించామని, దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ విషయమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Courtesy Andhrajyothi