ఆగస్టు 6వ తేదీ 1991 గుంటూరు జిల్లా చుండూరు అగ్రకుల దురహంకారుల చేతిలో 8 మంది హత్యకు గురయ్యారు. ఒక దళిత మహిళ ఢిిల్లీ ఆందోళన సందర్భంగా ప్రమాదంలో చనిపోయింది. మరో దళిత యువకుడు పోలీస్ కాల్పులకు బలికాగా, ఓ తమ్ముడు గుండె పోటుతో…మొత్తం 11 మంది చనిపోయారు.
దళితుల ఆత్మగౌరవం పోరాటంలో పోలీసుల సాక్షిగా జరిగిన హత్యలివి. వీటికి వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాలు పోరాటాలు చెయ్యగా చుండూరులో పెట్టిన ప్రత్యేక కోర్టులో ముద్దాయిలకు శిక్ష పడింది. ముద్దాయిలు హైకోర్టుకు వెళ్ళగా వారందరూ నిర్దోషులుగా జడ్జి నరసింహారెడ్డి తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై మొట్టమొదటిసారిగా సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు స్పందించారు. అన్ని దళిత, ప్రజా సంఘాలను కలుపుకుని ‘చుండూరు మారణకాండలో పాల్గొన్న ముద్దాయిలందరూ నిర్దోషులైతే మరి దోషులు ఎవరు?’ అని కోర్టుల ముందు కెవిపియస్ నిరసన తెలిపింది. చుండూరు నుంచి తెనాలి వరకు…విజయవాడ నుండి తెనాలి వరకు పాదయాత్రలు నిర్వహించి తెనాలిలో వేలాది మందితో కెవిపియస్ ఆధ్వర్యంలో ముగింపు సభ జరిగింది. ఈ తీర్పుపై చుండూరు బాధిత పోరాట కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది.
అగ్ర రాజ్యమైన అమెరికాలో జాత్యహంకారంతో నల్ల జాతీయుల పీకలు నులిమేస్తున్నారు. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు చేస్తున్న ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జడిసి బంకర్లో దాక్కున్నాడు. మన దేశం మనువాదుల పాలనలో ఉంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళిత, మైనారిటీలపై దుర్మార్గమైన దాడులు జరుగుతున్నాయి. ఇష్టమైన ఆహారం తిన్నా, మంచి బట్టలు వేసుకున్నా, చేతికి వాచీ పెట్టుకున్నా, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాటలు సెల్ ఫోన్లో రింగ్టోన్ గా పెట్టుకున్నా నేరమే. వారిపై కుల దురహంకారులు దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘోరాలను నివారించడంలో పాలకులు విఫలమయ్యారు. ముద్దాయిలను కాపాడేందుకు దళితులకు గుండెకాయ, ఆయుధం లాంటి చట్టాలను సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని నిర్వీర్యం చేస్తున్నారు. దళిత, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టుల ఆందోళనలతో మనువాద మతోన్మాదులు వెనక్కి తగ్గినట్లు నటిస్తూ అదను కోసం చూస్తున్నారు.
మన రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా దళితులపై దుర్మార్గమైన దాడులు జరిగాయి. అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడులు చెయ్యడం, వారికి పోలీసులు సహాయ పడడం చూస్తూనే వున్నాం. కంచే చేను మేసినట్లు రక్షక భటులే భక్షకులైనారు. రాజమండ్రి సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ పై ఇసుక మాఫియా వైసిపి నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్.ఐ చిత్రహింసలు పెట్టి శిరోముండనం చేశారు. 30 సంవత్సరాల క్రితం జరిగిన శిరోముండనం కేసు కోర్టులో ఇంకా పెండింగులో ఉంది. ప్రకాశం జిల్లా చీరాలలో మాస్క్ లేదని దళిత యువకుడు కిరణ్బాబు ను ఎస్.ఐ కొట్టి చంపారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన షైనీ అబ్రహంపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. కిరణ్ మృతికి కారణమైన ఎస్.ఐ విజయకుమార్ బెయిల్ పై బయట ఉన్నాడు. ఇదీ పరిస్థితి!
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం లోని హోసూరు గ్రామంలో దళితుల మేక…అగ్ర కులస్తుల పొలంలో పడిందని దళితులపై దాడి చేసి పల్లె చుట్టూ ఐదడుగుల గుంట తీసి దళితులను దూరంగా పెట్టారు. అదే జిల్లాలో అక్రమంగా సస్పెన్షన్కు గురైన జడ్జి రామకష్ణ…అధికార పార్టీ భూ కబ్జాలపై ఫిర్యాదు చేశారని ఓర్చుకోలేని వైసిపి నేతలు దాడులు చేశారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా ఎస్.ఐ కేసు నమోదు చెయ్యలేదు. ఈ ఘటనలో దోషులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు అందిస్తున్నారు. ఇది మీడియా ద్వారా బయటికి రావడాన్ని సహించలేని మంత్రివర్యులు…డాక్టర్లు, న్యాయవాది, న్యాయమూర్తులను ‘వాడు..వీడు’ అని సంబోధిస్తూ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మంత్రి దళిత మేధావులను అగౌరవంగా పబ్లిక్గా మాట్లాడటం వారిలోని అహంకారాన్ని తెలియ చేస్తుంది. మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లోని కళ్లపరిలో దళితులపై జరుగుతున్న కులవివక్షను ప్రశ్నించారని అగ్రకుల పెత్తందార్లు దాడులు చేసి… తిరిగి దళితుల పైనే కౌంటర్ కేసులు పెట్టారు. కరోనా మహమ్మారి ప్రపంచం అంతా వ్యాపిస్తుంటే మాదిగల వల్లే కరోనా వస్తోందని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం లోని కన్నెకాపురంలో…మాలల వల్లే కరోనా వస్తుందని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని వెంకటాపురంలో నడిచే రోడ్డుకి అడ్డంగా పెత్తందార్లు కంచె వేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల స్థలం ఇమ్మని అడిగిన దళితుడిపైన అధికారపక్షం నేతలు దాడికి దిగారు. గోడు వెళ్లబోసుకుందామని పోలీస్స్టేషన్కి వెళ్లిన బాధితుడ్ని సిఐ బూటు కాలితో తన్నారు. ఇదీ న్యాయం!
మన రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా వాటి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కృషి చెయ్యడం లేదు. వ్యక్తులు, పార్టీలు మాత్రమే మారుతున్నాయి. విధానాలు మారడం లేదు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరిగినప్పుడు ఒక్కసారి కూడా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరపలేదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి సంవత్సరం దాటినా ఒక్క సమావేశం కూడా జరగలేదు.
రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులపై జుడిషియల్ విచారణ జరిపించాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం సి.యం, మంత్రి, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రాష్ట్ర, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు 3 నెలలకోసారి జరిపి పెండింగులో ఉన్న కేసుల్లో ముద్దాయిల అరెస్టులు, బాధితులకు రిలీఫ్ మంజూరు, రక్షణ చర్యలపై చర్చించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డిజిపి ని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో బహిరంగ లేఖలు రాశాం. అయినా స్పందన కరువైంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు కనీసం పరామర్శ చేసి ముద్దాయిలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ…చుండూరు దళిత మతవీరులను స్మరించుకుందాం.
అండ్ర మాల్యాద్రి (వ్యాసకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిపియస్)
Courtesy Nava telangana