- ప్రాణాలతో పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు?
- ఆయుధాలు ఉన్నది ఇద్దరు నిందితుల వద్దే కదా!
- పది మంది కలిసి నలుగురిపై కాల్పులెందుకు జరిపారు?
- ఎన్కౌంటర్పై పోలీసులను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ
- గాయపడిన పోలీసులపైనా 3 గంటలపాటు ప్రశ్నల వర్షం
హైదరాబాద్ : నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు!? నలుగురు నిందితులూ రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెబుతున్నారు. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారనీ అంటున్నారు. నిందితుల్లో ఇద్దరి వద్దే ఆయుధాలు ఉన్నాయి. మీరు పదిమంది సాయుధులుగా ఉన్నారు. మరి, నలుగురిపైనా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది!? అని ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు ఆరిఫ్ ఒంట్లో మూడు తూటాలు దిగినా.. పిస్టల్ వదలకుండా చేతిలో అలాగే ఎలా ఉందని సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో నిందితుడు చెన్నకేశవులు చేతిలోనూ పిస్టల్ అలాగే ఉందన్న విషయంపై కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే, ఎన్కౌంటర్ మృతులకు పంచనామా నిర్వహించిన షాద్నగర్ రెవెన్యూ అధికారులను కూడా విచారించింది.
‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొని గాయపడిన ఇద్దరు పోలీసులపైనా ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ను సుమారు మూడు గంటలపాటు విచారించింది. వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది.
Courtesy Andhrajyothi…