- రామ్ గోపాల్ వర్మ మా పేర్లతో అమ్ముకోవాలని చూస్తున్నాడు
- పోస్టర్ చూసి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది
- ‘మర్డర్’ చిత్రంపై అమృత ఆగ్రహం
మిర్యాలగూడ: తన కథ పేరుతో దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించిన సినిమాకు, తన జీవితానికీ ఏ సంబంధం లేదని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత స్పష్టం చేశారు. తన కథ తన సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదని అన్నారు. ఆదివారం వర్మ విడుదల చేసిన పోస్టర్ చూసిన తర్వాత తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని వ్యాఖ్యానించారు. ‘‘నా జీవితం మరోసారి తలకిందులైంది. ఉపన్యాసాలిచ్చే దర్శకుడికి.. మా కథ చెప్పబోయే ముందు మా అనుమతి తీసుకోవాలని తెలియదా? నా జీవితానికీ, ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు.
ఓ కట్టుకథకు మా పేర్లు పెట్టుకుని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పని వల్ల ఆయనకు పబ్లిసిటీ వచ్చుంటుంది. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి చాలా ఒత్తిడి మధ్య భావోద్వేగ జీవితం గడుపుతున్నా. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నా’’ అని అమృత వ్యాఖ్యానించారు. వర్మపై కేసు వేసి ఆయనకు పబ్లిసిటీ కల్పించే ఉద్దేశం లేదన్నారు. ఆయన ఓ ఫేక్ ఫిలిం మేకరని, ఆయన కన్నా తనే ఎక్కువ జీవితాన్ని చూశానన్నారు.
Courtesy Andhrajyothi