వేదికపై నటుడు రాజశేఖర్ ఆవేశం
అధ్యక్షుడు నరేశ్ తీరుపై మండిపాటు
తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన
చిరంజీవి, మోహన్బాబు అసహనం
ఆ తర్వాత క్షమాపణ చెప్పిన జీవిత
‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లోని లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. గత ఏడాది మార్చిలో ‘మా’ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగిన రోజు మొదలైన అభిప్రాయ భేదాలు ఆరు నెలల్లోనే తారస్థాయికి చేరాయి. గురువారం జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాయి. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అసలు విషయంకంటే రాజశేఖర్ వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి. డైరీని ఆవిష్కరించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మా’లో మంచి ఉంటే మైక్లో మాట్లాడుకుందాం.
చెడు ఉంటే చెవిలో చెప్పుకొని, అందరం కలిసి సమస్యను పరిష్కరించుకుని అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడదాం’’ అని పిలుపు ఇచ్చారు. ఆ మాటలతో సినీ నటుడు రాజశేఖర్ తీవ్రంగా విభేదించారు. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పరుచూరి గోపాలకృష్ణ చేతిలో మైక్ లాక్కొన్నారు. తాను మాట్లాడే ముందు వేదికపై ఉన్న అందరి కాళ్లకు నమస్కారం చేశారు. ‘‘మా’లో గొడవలున్నాయి. అధ్యక్షుడు నరేశ్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో కొత్త కార్యవర్గం ప్రారంభమైనప్పటి నుంచీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. ‘మా’ కోసం ఎందుకంత కష్టపడుతున్నావ్’ అని ఇంట్లో బాగా తిడుతున్నారు.
అందరూ కలిసి నడవాలని చిరంజీవిగారు బాగానే చెప్పారు. అయితే, నిప్పు లేనిదే పొగ రాదు. అసోసియేషన్లో గొడవలున్న మాట వాస్తవం. అవన్నీ బయటకు తెలిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రియల్ లైఫ్లో నేను హీరోగా కష్టపడుతుంటే తొక్కేయాలని చూస్తున్నారు. అసోసియేషన్ కోసం నేను చాలా కష్టపడుతున్నా. ఆ ఒత్తిడితోనే నా కారు ప్రమాదానికి గురైంది’’ అని వ్యాఖ్యానించారు. మధ్యలో మోహన్బాబు నిలువరించాలని ప్రయత్నించినా ఆయన మాటను లెక్కచేయకుండా రాజశేఖర్ వ్యవహరించారు. ఆయన చర్యలకు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్బాబు అసహనానికి గురయ్యారు.
పెద్దరికానికి విలువేది: చిరంజీవి
రాజశేఖర్ మాటలను చిరంజీవి అదే వేదికపై ఖండించారు. ‘‘అసోసియేషన్ నవ్వులపాలు కాకూడదన్న ఉద్దేశంతో కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామన్న నా మాటకు ఈ సభలో విలువెక్కడుంది? మాటకు విలువ లేని పెద్దరికం ఎందుకు?’’ అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ పద్ధతిని తప్పుబట్టారు. సభా గౌరవం, ప్రొటోకాల్ లేకుండా ప్రవర్తించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరారు. ప్రణాళిక ప్రకారమే కార్యక్రమాన్ని రసాభాస చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడటంతో రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘‘సవాళ్లకు ఇక్కడ తావు లేదు. ‘మా’ అందరిదీ. కలసి పని చేసుకుందాం’’ అని మోహన్బాబు హితవు పలికారు. కొద్దిసేపటి తర్వాత రాజశేఖర్ భార్య జీవిత కలగజేసుకుని, జరిగిన దానికి క్షమాపణ చెప్పారు.
నరేశ్ శైలి నచ్చలేదు: రాజశేఖర్
సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తునట్లు ‘మా’ కార్యాలయానికి రాజశేఖర్ ఓ లేఖ పంపారు. ‘‘‘మా’లో సమస్యలను పరిష్కరించడానికి బదులు ప్రెసిడెంట్ నరేశ్ ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో అవమానకరంగా మాట్లాడుతున్నారు. మెజారిటీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలను పక్కన పెట్టి ఆయనకు నచ్చింది చేసుకెళ్తున్నారు. ఆ విషయం ఇండస్ర్టీలోని పెద్దలకు వివరించాం. అయినా, ఆయనలో మార్పు రాలేదు. అందుకే, డైరీ ఆవిష్కరణలో తీవ్ర భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయా. నరేశ్ శైలి నాకు నచ్చడం లేదు. అందుకే ‘మా’ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నారు. చిరంజీవితో కానీ, మోహన్బాబుతో కానీ తనకే గొడవలు లేవని, ‘మా’ అధ్యక్షు డు నరేశ్తో, ‘మా’తోనే విభేదాలున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు, చిరంజీవి, మోహన్బాబు మధ్య వ్యక్తిగత గొడవగా చిత్రీకరించవద్దని ట్వీట్ చేశారు.
‘మా’ లోగో మార్పుపై చిరంజీవి ఆరా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లోగో మార్పుపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ‘మా’ మారిన లోగోని చిరంజీవి గమనించి తన పక్కనే కూర్చున్న ‘మా’ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ను ఆరా తీశారు. ఎన్నో ఆలోచించి, దర్శకుడు బాపుతో ఆ లోగో తయారు చేయించామని, ఎవరినీ సంప్రదించకుండా లోగోను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కొత్త లోగో గురించి చిరంజీవి దగ్గరకు వెళ్లి ఏదో వివరణ ఇచ్చారు.
f(Courtesy Andhrajyothi)