సివిల్ సర్వీస్ అధికారుల నియామకంపై సర్వత్రా విమర్శలు
– గవర్నర్ నియామకాలకు మోడీ సర్కారు తూట్లు
– సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ బ్యూరో: సాధారణంగా భారత రాజకీయ వ్యవస్థలో అనుభవమున్న నాయకులను కేంద్రం గవర్నర్లుగా నియమించడం దేశంలో అనధికారిక నిబంధనగా కొనసాగుతున్నది. కానీ మోడీ హయాంలో ఐఏఎస్ అధికారులు, మాజీ జడ్జిలను రాష్ట్రాలు, యూటీలకు నియమించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బీజేపీలోనూ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ఇటీవలే జమ్మూకాశ్మీర్ను రెండు కేంద్ర ప్రాంతాలుగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ఇంతకాలం గవర్నర్గా కొనసాగిన సత్యపాల్ మాలిక్ను గోవాకు పంపించిన కేంద్రం.. గతవారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లుగా మాజీ ఐఏఎస్ అధికారులను నియమించింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారికి పదవులను ఇవ్వకుండా ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వమేంటని ఇటీవల ఢిల్లీలో సమావేశమైన బీజేపీ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.
పార్టీ నిర్మాణానికి నేతలా? ఐఏఎస్ లా?
బీజేపీ పెట్టినప్పటి నుంచి తాము పార్టీకి సేవ చేస్తున్నామని, తాము ఉండగా ఐఏఎస్ అధికారులను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమించడం ఏంటని బీహార్కు చెందిన ఓ బీజేపీ నేత ఢిల్లీలో జరిగిన ఆసమావేశంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, జేడీయూ పోటీలో ఉన్నా బీజేపీని రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేశామని అంటున్నారు. పదవుల ఆదరణలో మాత్రం ఐఏఎస్, న్యాయమూర్తులకి అవకాశం ఇస్తే తాము ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిర్మాణానికి కృషి చేసింది ముందు నుంచి తామని… బ్యూరోక్రాట్టులు, న్యాయమూర్తులు కాదని వాపోయారు. కిరణ్ బేడీ వంటి ఆయా గయారాం నేతలు వచ్చి రాగానే పదవులు పొందుతున్నారని… పార్టీ కోసం క్రమశిక్షణగా పని చేసిన కార్యకర్తలకు ఇటువంటివి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఐఏఎస్, జడ్డిలనూ నియమించడంపై విమర్శలు
కేంద్ర పాలిత ప్రాంతాలకు సాధారణ గవర్నర్ల కంటే కొంతమేర అధికమైన అధికారాలుంటాయి. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పాటు ఉన్న సాధారణ అధికారాలతో పాటు, మరికొన్ని పరిపాలక అధికారాలు సైతం ఎల్జీలకు ఉంటాయి. దీంతో ఇటువంటి ప్రాంతాలకు పరిపాలన అనుభవం ఉన్న వారిని కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. కానీ, మోడీ సర్కారు కేవలం మాజీ ఐఏఎస్, మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రాంతాల్లో తాము సైతం మంత్రులుగా పని చేశామని దాని ద్వారా పరిపాలన అనుభవం తమకు కూడా ఉంటుందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైనంత మాత్రాన తాము పనికి రామా? అన్న వాదనని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇంతకుముందు కేరళ గవర్నర్గా నియామకమైన జస్టిస్ సదాశివం సైతం భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన విషయం తెలిసిందే. పార్టీ నాయకుల కంటే ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులైతే కేంద్రం ఏది చెప్పినా చేస్తారని మోడీ సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగ సభ చర్చ సందర్భంలో గవర్నర్ల అధికారులు, బాధ్యతలపై పెద్ద ఎత్తున చర్చ సైతం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 గవర్నర్ల నియామకంపై ప్రత్యేకంగా పేర్కొంది. సాధారణంగా రాష్ట్రంలోని పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదనే జరిగినా కార్యనిర్వాహక అధికారాలు ఉండవు. ఆర్టికల్ 153 నుంచి 164 వరకు గవర్నర్కు సంబంధించిన విషయాలపైనే రాజ్యాంగం స్పష్టం చేసింది. కానీ, ఆ వ్యవస్థ బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే, మొదటి నుంచి గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను అస్థిర పరచడం, కుట్రపూరిత ఎత్తుగడలకు సైతం రాజ్భవన్లే వేదిక కావడం తెలిసిందే. ఆ వ్యవస్థను రద్దు చేసి అకౌంటుబుల్ అడ్మిస్ట్రేటర్ సిస్టమ్ ( జవాబుదారీ కేంద్ర ప్రతినిధి వ్యవస్థ) ఉండాలని సీపీఐ(ఎం) సూచన చేస్తున్నది. కానీ, కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తమకు కీలు బొమ్మలుగా ఉండేందుకు గవర్నర్ వ్యవస్థను ప్రజాస్వామ్యయుతం చేయడం లేదు.
వివాదస్పదంగా గవర్నర్ల నిర్ణయాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా వేరే ఇతర రాజకీయ పక్షం ఏదైనా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే గవర్నర్ల వ్యవహారశైలి వివాదాస్పదం అవుతుంది. గతంలో అటువంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. ఇటీవల కాలంలో సైతం అటువంటి ఘటనలు పెద్ద ఎత్తునే ఉన్నాయి. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలళిత మరణంతో రాజకీయ సందిగ్దత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం, శశికళ గ్రూపుల మధ్య ఏర్పడిన విభేధాల్లో గవర్నర్ జోక్యం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దాంతోపాటు, గోవా, మణిపూర్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకున్నప్పకీ అక్కడి గవర్నర్ల కారణంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సిక్కింలో అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఓట్లు సాధించి, ఒక్క స్థానం కూడా సాధించని దుస్థితిలో బీజేపీ ఉన్నప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రధాన ప్రతిపక్ష స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. దీనిపై రాష్ట గవర్నర్ ఫిర్యాదు చేద్దామని అక్కడి కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరినా అక్కడి గవర్నర్ తొందరగా అవకాశం ఇవ్వలేదు. కర్నాటకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ ఘటనలన్నీ కేంద్రం అండదండలతోనే జరిగాయి. ఈ వ్యవస్థపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడ్డారు.
Courtesy: NT..