– రాఫెల్పై వార్తా కథనాలు రాసినందుకు ప్రకటనలు రాకుండా చేశారు
– అయినా మేం తలొగ్గలేదు : ‘ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్’ డైరెక్టర్ ఎన్.రామ్
న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై పరిశోధనాత్మక వార్తా కథనాలు రాసిన తర్వాత ‘ద హిందూ’ పత్రిక ప్రకటనల ఆదాయం దారుణంగా పడిపోయిందని, అయినా ఈ సవాల్ను తాము ఎదుర్కొన్నామని, పాలకుల కుయుక్తులకు తాము తలొగ్గలేదని ‘ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్’ డైరెక్టర్ ఎన్.రామ్ అన్నారు. ఆనాడు ‘ద హిందూ’ దినపత్రిక స్వతంత్ర జర్నలిజం వైపు నిలబడిందన్నారు. ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్న సందర్భంలో ఎన్.రామ్ను మీడియా పలకరించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో దినపత్రికలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. స్వతంత్ర జర్నలిజం వైపు నిలబడుతారా? పాలకుల మోచేయి నీళ్లు తాగుతారా ? అన్నది తేల్చుకోవాల్సిన సమయం అది. ‘ద హిందూ’ స్వతంత్ర జర్నలిజం వైపు నిలబడింది. పాలకుల ఒత్తిడికి మేం తలొగ్గలేదు” అని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా పత్రికలపై పాలకులు వేధింపులకు దిగుతున్నారని, మీడియా సంస్థలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని ఎన్.రామ్ అన్నారు. తాజా ఉదంతం గురించి చెబుతూ, ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలమేరకు ‘న్యూస్ 18′(తమిళనాడు) సీనియర్ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం
భారత రాజ్యాంగ వ్యవస్థలు ఒక్కొక్కటిగా దుర్వినియోగమవుతున్నాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టులో గతకొన్నాండ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు అసంతృప్తికి గురిచేశాయి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలి నిర్ణయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అలాగే గవర్నర్ల వ్యవస్థ ఎలా ఉందో, గవర్నర్లు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నాం. రాజస్థాన్ పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ..అని ఆయన అన్నారు.
Courtesy Nava telangana