హైదరాబాద్: లండన్ తరహాలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థ బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని రూట్లను ప్రైవేటీకరించి ఏడాదికి సుమారు పాతికవేల చొప్పున నాలుగైదేళ్లలో లక్ష పైవేటుబస్సులను అద్దె పద్దతిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
కేంద్ర ఉపరితల రవాణాశాఖ చేసిన ఈ ప్రతిపాదనపై నీతిఆయోగ్ లో ఇటీవల చర్చ జరిగింది. సంబంధిత దస్త్రం కేంద్ర ఆర్థికశాఖకు చేరింది. అక్కడ ఆమోదంతో పాటు కొత్త విధానంపై రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో త్వరలో జరిగే భేటీ ముందుకు రానుంది. అందుకు అవసరమైన భారీ రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అద్దెకు తీసుకునే ప్రైవేటు బస్సులను ఆర్టీసీల ద్వారా నడిపించాలని కేంద్రం భావిస్తోంది. ఈ బస్సులతో వచ్చే నష్టాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజారవాణా వ్యవస్థ వృద్ధి కోసం.. సర్దుబాటు వ్యయ నిధి (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్)ని ఏర్పాటుచేయాలని ప్రపంచబ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ప్రైవేటు అద్దె బస్సులతో వచ్చే నష్టంలో కొంత మొత్తాన్ని కేంద్రం భరించనుంది. ప్రపంచబ్యాంకు నుంచి తీసుకునే రూ.70,000 కోట్ల రుణంలో 70 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు పోతుందని అంచనా. మిగిలిన మొత్తంలో ప్రధానంగా అద్దెబస్సులకు జీపీఎస్ పరికరాలు, అవి తిరిగే కిలో మీటర్ల లెక్కలు వేసి డబ్బుల చెల్లింపు వంటి అవసరాలకు ఖర్చుచేయనున్నారు.
Courtesy Eenadu