– ప్రభుత్వ శాఖల్లో ప్రయివేటు కార్గో సర్వీసులు తిష్ట
– అవసరమైతే చార్జీలు తగ్గిస్తామని ప్రతిపాదనలు
– క్షేత్రస్థాయి పరిశీలనలో దిమ్మతిరిగే వాస్తవాలు
– డోలాయమానంలో టీఎస్ఆర్టీసీ అధికారులు
– సర్వీసుల ప్రారంభం మళ్లీ వాయిదా
టీఎస్ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసులకు అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు ఎక్కాల్సిన ఈ సర్వీసులు ఇంకా బాలారిష్టాలను దాటట్లేదు. ఈ సర్వీసుల్ని ప్రారంభిస్తారా…లేక ఉపసంహరించుకుంటారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు కార్గో సర్వీసుల ఒత్తిడికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు తలొగ్గుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కార్గో సర్వీసుల కోసం 40కి పైగా బస్సుల డిజైన్లను మార్పులు చేసి, సిద్ధంగా ఉంచారు. అయినా ఆర్టీసీ అధికారుల్లో ఆ సర్వీసులు లాభసాటిగా నడుస్తాయనే విశ్వాసం కనిపించట్లేదు. సీఎం కేసీఆర్ ఈ సర్వీసుల్ని ప్రారంభించమని ఆరేండ్లుగా చెప్తూనే ఉన్నారు.
55 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆ తర్వాత ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో జరిగిన కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలోనూ ఇదే ప్రధాన అంశంగా ప్రచారం జరిగింది. ఆర్టీసీ అధికారులు ఆఘమేఘాల మీద ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రయివేటు కార్గో, పార్సిల్ సర్వీసుల సేవలు, రేట్లు, ఖర్చులు, నిర్వహణను పరిశీలించివచ్చారు. 40 ఆర్టీసీ బస్సులను కార్గో సర్వీసులకు అనుకూలంగా బస్బాడీ డిజైన్లలో మార్పులు చేశారు. ఫిబ్రవరిలో ఈ సర్వీసుల్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ జనవరి 29న ప్రకటించారు. ఆర్టీసీకి సీఎం కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అయినందున కార్గో వాహనాలపై ఆయన ఫోటోలు, కాప్షన్లు రాసి, విస్త్రుత ప్రచారం చేస్తామనీ ప్రకటించారు. మంత్రి చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదు. పైగా ఆర్టీసీ కార్గో సర్వీసులపై సీఎం కేసీఆర్ ఫోటోలు ఉండబోవంటూ ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రి అజరుకుమార్ ప్రకటనను సవరించింది.
Courtesy Nava telangana