కృష్ణార్జునరావు
మిత్రులారా!
ఈరోజు సెప్టెంబర్ 14 మిర్యాలగూడలో ప్రణయ్ చనిపోయి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు. నేడు ప్రణయ్ రెండవ వర్ధంతి. ప్రణయ్ చనిపోయిన ఈ రోజును పరువు హత్యల నిరసన దినం గా జరుపుకుందాం!.
2018 సెప్టెంబర్ 14వ తేదీన తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలో పెరుమాళ్ ప్రణయ్ అనే ఒక దళిత యువకుడు పట్టపగలు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు.ఆ హత్య చేపించింది ఎవరో కాదు, స్వయాన తన మామ మారుతీరావు. మారుతీరావు కూతురు అమృత వర్షిణి దళిత యువకుడైన ప్రణయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వైశ్య కులానికి చెందిన మారుతీరావు తన కూతురు ఒక దళిత కులస్థుడిని వివాహం చేసుకోవటాన్ని సహించలేక పోయాడు. కన్న కూతురు జీవితం సర్వ నాశనం అయినా పర్వాలేదని భావించి, కిరాయి హంతకునితో హత్య చేయించాడు.
ప్రణయ్ హత్యను ఖండిస్తూ ఆనాడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. అన్ని ప్రగతిశీల సంస్థలు ఈ హత్యను ఖండించాయి. కుల చట్రంలో జీవించే సాధారణ ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఈ ఘోర హత్యను ఖండించారు. తనకు న్యాయం కావాలని ఘోషించిన ప్రణయ్ భార్య అమృతకు అన్ని సామాజిక సంస్థలు అండగా నిలిచాయి. దాదాపుగా అన్ని ప్రచార మాధ్యమాలు అమృత వర్షిణీ ఆక్రోశాన్ని సమాజం ముందు ఉంచాయి.
ప్రణయ్ కు ముందు దేశంలో ఎన్నో కుల హత్యలు పరువు మాటున జరిగాయి. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న, చేసుకోవాలనుకున్న యువతను ఈ మనువాద సమాజం అతి కర్కశంగా చంపేసింది.
అయినా ఆ హత్యలకు రాని జాతీయ స్థాయి ఆందోళన, అలజడి ప్రణయ్ హత్యకు వచ్చే లాగా కుల తత్వానికి గట్టిగా ఎదురు తిరిగి అమృత వర్షిణి పోరాడింది.
ప్రణయ్ హత్య కేసు నల్గొండ జిల్లా కోర్టులో నడుస్తుంది.
ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రణయ్ హత్యకు ప్రధాన నిందితుడైన మారుతీరావు తన స్వయం కృతాపరాధం వల్ల తన కుటుంబం అస్తవ్యస్తమై పోవటాన్ని అవలోకనం చేసుకుని వేదనా భరిత హృదయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రణయ్ కేసు ప్రస్తుతం వాయిదాలు జరుగుతుంది. వాయిదాల అనంతరం జరిగే న్యాయ విచారణలో కోర్టు తీర్పు అమృతా ప్రణయ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అనుకూలంగా వస్తుందని ఆశిద్దాం.
అయితే కోర్టుకు వెలుపల అన్ని ప్రగతిశీల సంస్థలు, అభ్యుదయ వాదులు కులాంతర వివాహితులపై జరుగుతున్న అమానుష దాడులను అరికట్టే చర్యల్లో భాగంగా కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తీసుకు వచ్చే విధంగా పోరాటాలు చేయవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం కోసం పోరాడటమంటే, అది కుల నిర్మూలనా పోరాటాల్లో భాగమే తప్ప వేరు కాదని మనందరికీ తెలిసిన విషయమే.
మిత్రులారా!
సెప్టెంబర్ 14 ను పరువు హత్యల నిరసన దినంగా పాటిస్తూ – రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం సాధించేంత వరకు పట్టు వదలకుండా ఐక్యంగా కృషి చేసేందుకు అన్ని ప్రగతిశీల సంస్థలు, అభ్యుదయ వాదులు దీక్ష వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రణయ్ హత్యకు గురైన సందర్భంలో ప్రజలు – ప్రగతిశీల సంస్థలు పరువు మాటున జరుగుతున్న ఈ కుల హత్యలను ఖండిస్తూ ఎంత పెద్ద ఎత్తున తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారో – అదే చైతన్యం తోటి, సామాజిక బాధ్యత తోటి నేడు కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం అందరూ కలసి సాధించుకోవాలి.
అమరుడు ఉసా కులాంతర వివాహితులపై జరగే దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఆ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పోరాడే వారు. నేడు ఉసా లేకున్నా ఈ సమస్యపై ఆయన అందించిన స్ఫూర్తిని అంది పుచ్చుకుని కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టాన్ని సాధించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుదాం.
@ జోహార్ జోహార్ పెరుమాళ్ ప్రణయ్ కు!
@జోహార్ జోహార్ పరువు హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన మృత వీరులందరికీ!
@ అండగా ఉంటాం.. అండగా ఉంటాం… అమృతా ప్రణయ్ చేస్తున్న న్యాయ పోరాటానికి!
@సాధిస్తాం… సాధిస్తాం… కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టాన్ని!