- క్రమంగా తగ్గిపోతున్న లబ్ధిదారుల సంఖ్య
- రాష్ట్రంలో 60 లక్షల మంది పట్టాదారులు
- ప్రతి విడతలోనూ 31-35 లక్షల మందికే పంపిణీ
- ఐదో విడతలో 24 లక్షల మందికే నగదు బదిలీ
హైదరాబాద్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధి పొందే అన్నదాతల సంఖ్య విడత విడతకూ తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది పట్టాదారులు ఉంటే.. నాలుగు విడతల్లో కూడా ప్రతిసారీ 31-35 లక్షల మంది రైతులకే ఆర్థిక సహాయం అందింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ హోల్డర్లు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, పింఛనుదార్లు కలిపి 10-15 లక్షల మందికి మినహాయించినా.. 45-50 లక్షల మంది రైతులకు పీఎంకిసాన్ ఆర్థిక సహాయం అందాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తొలి విడతలో 36.70 లక్షల మందికి రూ.2వేల చొప్పున సాయం అందితే.. ఐదో విడతకు వచ్చే సరికి కేవలం 24.29 లక్షల మందికే అందడం ఆందోళనకు గురిచేస్తోంది.
అర్హులకు మొండిచేయి
ఈ వానాకాలం సీజన్లో 57.62 లక్షల మందికి రాష్ట్రం అమలు చేస్తున్న రైతు బంధు పథకం అందింది. కానీ, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. 60 లక్షల మంది పట్టాదారుల్లో 57.62 లక్షల మందికి రైతుబంధు అందగా.. పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం కనీసం 45-50లక్షల మందికి సాయం అందాలి. కానీ, మొదటి విడతలో 36.70 లక్షలు, రెండో విడతలో 35.82 లక్షలు, మూడో విడతలో 34.06 లక్షలు, నాలుగో విడతలో 31.48 లక్షలు, ఐదో విడతలో 24.29 లక్షల మంది రైతుల ఖాతాల్లో మాత్రమే కేంద్రం డబ్బులు జమచేసింది. ఇందులోనూ సగం మంది లబ్ధిదారులకే కేంద్ర సహాయం అందింది. సగం రైతులకు మొండిచేయి చూపించారు. ఒకవైపు డేటా అప్రూవల్ చేసిన రైతులకు ఆర్థిక సహాయం అందకపోగా.. మరోవైపు అప్రూవల్ కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 1 నుంచి ఆరో విడత షెడ్యూల్ ప్రారంభమైంది. నవంబరు నాటికి ఆరో విడత సాయం అందించాల్సి ఉంది.
ఐటీ విభాగం.. అంతా గందరగోళం
రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్లో ఐటీ విభాగం ఉంది. ఓ డిప్యూటీ డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఈ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 10-15 లక్షల మంది రైతుల దరఖాస్తులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ హోల్డర్లు, డాక్టర్లు, లాయర్లు, ప్రజాప్రతినిధులు తదితర కేటగిరీలకు చెందిన వారిని తొలగించే క్రమంలో డేటా ప్యూరిఫికేషన్ ఆలస్యమవుతోంది. దీనికితోడు 2019 ఫిబ్రవరి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల వివరాలను మాత్రమే అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం విధించింది. దీంతో ఏడాదిన్నరగా కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకున్నా లబ్ధిదారుల జాబితాలో చేరడం లేదు. లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ఈ కటాఫ్ తేదీని పెట్టినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంమీద లక్షలాది మంది రైతు లు.. అర్హత ఉండీ పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నా రు. అనర్హుల వివరాలను అధికారులు ప్రకటించకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఈ విషయమై ఐటీ విభాగం డీడీ, ఏడీలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా… స్పందించలేదు.
Courtesy Andhrajyothi