న్యూఢిల్లీ : కర్నాటకలో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఆస్పత్రులు, కోవిడ్-19 చికిత్స కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రాష్ట్రంలోని కల్బుర్గీలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో పందులు సంచారం చేస్తున్నాయి. దాదాపు 50 వరకూ పందులు ఉన్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా జనాల ప్రాణాలు గాల్లో కలుస్తుండగా.. ఆస్పత్రిలో పందులు తిరుగుతుండటంతో అంటువ్యాధులు మరింత పెరిగే అవకాశముందని రోగులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నది. కాగా, దేశంలో మొదటి కరోనా మరణం కల్బుర్గీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్నాటకలో తాజాగా 4,120 కేసులు నమోదయ్యాయి. అలాగే, 91 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,156 పెరిగింది. కరోనా బాధితుల సంఖ్య 63,772 చేరింది.
శ్రీనగర్లో లాక్డౌన్
జమ్మూకాశ్మీర్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో శ్రీనగర్లో అధికారులు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేతులు కడుక్కొవడం, మాస్కులు ధరించడం, అవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్లో ఇప్పటివరకూ 13,198 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 7615 మంది కోలుకున్నారు.
పంజాబ్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా
పంజాబ్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. ”నా సహచర ఎమ్మెల్యేలు బల్విందర్ సింగ్, ధరంభీర్ అగ్నిహౌత్రిలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ సీఎం ట్వీట్ చేశారు. ఇటీవల క్యాబినెట్ మంత్రి రాజీందర్ సింగ్ బాజ్వాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా తన భార్య, తనయుడికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా, కొన్ని రోజులుగా పంజాబ్లో కోవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటివరకూ మొత్తం 9,792 కరోనా కేసుల నమోదుతోపాటు 246 మంది మరణించారు.
కరోనా ఆస్పత్రిలో వాన.. ఇబ్బందిపడ్డ రోగులు
ఇటీవల తెలంగాణలోని ఉస్మానియా ఆస్పత్రిలో వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే మాదిరిగా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలోకి సైతం వర్షపు నీరు చేరింది. వార్డులన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో అక్కడున్న రోగులను మరోచోటుకు తరలించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల యూపీలోని పలు ఆస్పత్రుల్లోనూ కరోనా రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, యూపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. 1,146 మరణాలు చోటుచేసుకున్నాయి.
మీడియా పాత్ర ప్రశంసనీయం
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ”కరోనా పై పోరులో ప్రసారమాధ్యమాల అసమాన పాత్ర” పేరుతో ఆదివారం విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్కు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలు నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. కరోనాపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులతోపాటు ముందువరసలో మీడియా నిలిచిందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో.. కరోనా, సమాజంలోని వివిధ వర్గాలపై దీని ప్రభావం తదితర అంశాలపై చర్చ జరిగేలా అజెండాను సైతం మీడియా సూచించిందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తయారీలో ఏడు భారత కంపెనీలు
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచంలోని దేశాల్లోని చాలా సంస్థలు తీవ్రంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. మన దేశానికి చెందిన ఏడు ఫార్మా కంపెనీలు కోవిడ్-19 వాక్సిన్ తయారీలో నిమగమై ఉన్నాయి. అవి భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, జైడస్ క్యాడిల్లా, పనేషియా బయోటెక్, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్, మైన్వ్యాక్స్, బయోలాజికల్ ఈ. వీటిలో ఇప్పటికే పలు సంస్థలు మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
Courtesy: NT