సైదాబాద్/హైదరాబాద్ : హైదరాబాద్లో పందులు దాడి చేయడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మైసిగండి వస్తాపురం తండాకు చెందిన వడిత్యా కేశ్యానాయక్, చిట్టి దంపతులు కూలీలు. సింగరేణి కాలనీలోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వారికి ఓ కూతురు, కుమారుడు హర్షవర్ధన్(3) ఉన్నారు. మంగళవారం సాయంత్రం తల్లి ఇంట్లో ఉండగా కొడుకు గుడిసె ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన పందుల గుంపు బాలుడిపై దాడి చేసి లాక్కెళ్లిపోతుండగా స్థానికులు గమనించారు. వాటిని వెంబడించి అడ్డుకున్నారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Courtesy Andhrajyothi