– బుక్లెట్లో ముద్రించిన ఒడిశా ప్రభుత్వం
– సిఎం క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్షాల డిమాండ్
భువనేశ్వర్ : మహాత్మాగాంధీ మృతిని ”ప్రమాదం”గా పేర్కొంటూ ఒడిశా ప్రభుత్వం ఒక బుక్లెట్ను విడుదల చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పంపిణీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఈ బుక్లెట్ను ప్రచురించింది. గమనార్హం. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ”మా బాపూజి : ఒక సింహావలోకనం” అంటూ ముద్రించిన రెండు పేజీల బుక్లెట్లో సంక్షిప్తంగా ఆయన బోధనలు, రచనలు, రాష్ట్రంతో సంబంధాల గురించి వివరించారు. 1948, జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్లో జరిగిన ప్రమాదం కారణంగా ఆయన మృతిచెందారని బుక్లెట్లో ముద్రించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణలు చెప్పాలని, ఆ తప్పును సరిదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పలువురు రాజకీయ నేతలు, విద్యావేత్తలు డిమాండ్ చేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని సిపిఎం నేత జనార్థన్ పాటి అన్నారు. ఇది ”క్షమించరాని చర్య” అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నరసింగ మిశ్రా వ్యాఖ్యానించారు. పట్నాయక్ ఈ తప్పుకు బాధ్యత వహించి క్షమాపణ కోరాలని, బుక్లెట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీని ద్వేషించే వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని, మహాత్మాగాంధీని ఎవరు హత్య చేశారో, అప్పటి పరిస్థితుల గురించి ప్రతి విద్యార్థికి తెలుసుకునే హక్కు ఉందని మిశ్రా వ్యాఖ్యానించారు. చరిత్రను వక్రీకరించడానికి, వాస్తవాలను దాచేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి ఆసిష్ కనుంగో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రచురణలో వాస్తవాలను తప్పుగా ముద్రించడానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతి డిమాండ్ చేశారు. కాగా, ఈ బుక్లెట్పై తీవ్ర గందరగోళం తలెత్తడంతో పట్నాయక్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ పేర్కొన్నారు.
Courtesy Prajasakti..