- నిమ్స్లో 6 నెలలుగా నిలిచిన సేవలు
- ఏటా 120 వరకు కిడ్నీల మార్పిడి
- ఈ ఏడాది కేవలం 12 లోపే..
- కార్పొరేట్కు వెళితే లక్షల్లోనే ఖర్చు
హైదరాబాద్: కొవిడ్ ప్రభావంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలకు ఇంకా మోక్షం కలగడం లేదు. ఆరు నెలలుగా ఈ చికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు పాడై మార్పిడి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కిడ్నీల మార్పిడి చికిత్సల్లో నిమ్స్కు మంచి పేరుంది. ఇతర కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో పాటు సమర్థమైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సదుపాయం ఉండటంతో చాలామంది మూత్రపిండాల మార్పిడికి నిమ్స్కు ప్రాధాన్యమిస్తుంటారు. ఈ చికిత్సలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.15 లక్షలపైనే వసూలు చేస్తున్నారు. అదే నిమ్స్లో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ ఉంటే ఉచితంగా చేస్తారు. ఒక్క నిమ్స్లోనే ఏటా 120 వరకు కిడ్నీల మార్పిడి చికిత్సలు జరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది మార్చి వరకు కేవలం 12 చికిత్సలు మాత్రమే నిర్వహించారు. ఉస్మానియాలో కూడా అడపాదడపా కిడ్నీ మార్పిడి చేసేవారు. కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో ఇక్కడా నిలిపివేశారు. కేవలం కొవిడ్తోపాటు ఇతర కొన్ని రకాల చికిత్సలపై మాత్రమే వైద్యులు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు కార్పొరేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు ఇప్పటికే ప్రారంభించారు. దాతతోపాటు గ్రహీతకు కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాత ముందుకు వెళుతున్నారు. ఇటీవలే ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో నెల రోజుల్లో రెండుసార్లు ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు చేశారు. వీటితోపాటు కిడ్నీల మార్పిడి చికిత్సలూ జరుగుతున్నాయి.
నిమ్స్లో 30 మంది నిరీక్షణ
* ప్రస్తుతం నిమ్స్లో 550 మంది నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరో 30 మంది వరకు మూత్ర పిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు.
* ఉస్మానియాలో నిత్యం 200-300 మంది డయాలసిస్పై ఆధార పడుతున్నారు. ఇక్కడా పేద రోగులు కిడ్నీల మార్పిడి కోసం నిరీక్షిస్తున్నారు.
* కిడ్నీల మార్పిడికి అవకాశం లేక చాలామంది రోగులు ప్రస్తుతం డయాలసిస్పై ఆధార పడుతున్నారు. వాస్తవానికి కుటుంబ సభ్యులు, లేదంటే దగ్గర రక్త సంబంధీకులు కిడ్నీలు, కాలేయం దానం చేయవచ్ఛు వీరిని లైవ్ డోనర్లుగా పిలుస్తారు. ఏదైనా ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయితే అలాంటి వారి నుంచి అవయవాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోపాటు ప్రభుత్వ జీవన్దాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి కిడ్నీ, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె వాల్వులు, కళ్లు లాంటివి సేకరించి ఇతరులకు అమర్చుతారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ఆగిపోవడంతో వేరే దారి లేక బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్నారు. కొవిడ్ సేవలకు అంకితమైన గాంధీ, ఉస్మానియాను పక్కన పెడితే.. నిమ్స్లో వైద్య సిబ్బందికి మాత్రమే కరోనా చికిత్సలు అందిస్తున్నారు. సాధారణ రోగులు వస్తే గాంధీకి పంపుతున్నారు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని నిమ్స్లో అవయవ మార్పిడి ప్రారంభించేందుకు అవకాశం ఉంది. రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఉన్నతస్థాయిలో చొరవ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అవయవాల కోసం జీవన్దాన్లో నమోదు చేసుకున్న వారు
మూత్రపిండాలు – 4018
కాలేయం – 3504
ఇతర అవయవాలు – 172
మొత్తం – 7694
ఇప్పటి వరకు దాతల నుంచి సేకరించినవి..
కిడ్నీలు – 1170
క్లోమ గ్రంథులు – 10
ఊపిరితిత్తులు – 23
కాలేయం – 701
గుండె – 100
నేత్రాలు – 659
గుండె వాల్వులు – 170
Courtesy Eenadu