– వలసకార్మికులకు చేయూతనివ్వని పథకం
– ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ జరిగింది 33శాతమే
– కేటాయింపు 8 లక్షల టన్నులు.. రాష్ట్రాలకు వచ్చింది 6.38 లక్షల టన్నులు
– నాలుగు నెలల్లో లబ్దిదారులకు చేరింది 2.64 లక్షల టన్నులే
– కేంద్రం గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వడం లేదు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తో నష్టపోయిన పేదలు, వలసకార్మికులు, చిన్నవ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చేయూతనందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం గతంలో తెలిపింది. కానీ, ఏ ఒక్క అంశంలోనూ ఈ పథకం సంతృప్తినివ్వడంలేదు.
ముఖ్యంగా వలసకార్మికుల విషయంలో పథకం విఫలమైందనే చెప్పొచ్చు. సాక్షాత్తు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారమే దీనికి సాక్ష్యంగా కనబడుతున్నది. సదరు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ పథకం కింద కేటాయించబడిన ఉచిత ఆహార ధాన్యాలలో కేవలం 33శాతం మాత్రమే గత నాలుగు నెలల్లో వలసకార్మికులకు పంపిణీ జరగడం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నది.
వలసదారుల కోసం కేటాయించిన 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలలో( బియ్యం, గోధుమలు) 6.38 లక్షల టన్నులు(80 శాతం) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)కు పంపిణీ జరిగింది. అయితే వీటిలో 2.64 లక్షల టన్నుల(33శాతం) ఆహార ధాన్యాలు మాత్రమే లబ్దిదారులకు పంపిణీ జరగడం గమనార్హం. ఆత్మనిర్భర్ పథకం కింద జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్) కింద లబ్ది పొందనివారు లేదా వారున్న రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వలసదారులకు రెండు నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తామని మేలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం విదితమే. కానీ, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయనీ, లబ్దిదారులకు ఆహార ధాన్యాలు కేటాయించిన స్థాయిలో చేరడం లేదని గణాంకాలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మే నెలలో 1.17 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వలసదారులకు పంపిణీ జరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అలాగే జూన్లో 1.24 లక్షలటన్నులు, జూన్లో 15,223 టన్నులు, ఆగష్టులో అత్యల్పంగా 7,643 టన్నులు మాత్రమే ఆహార ధాన్యాల పంపిణీ జరగడం గమనార్హం.
తెలంగాణలో 1శాతం.. ఆంధ్రప్రదేశ్లో నిల్
ఇక బీహార్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో 100 శాతం ఆహార ధాన్యాల పంపిణీ జరిగినట్టు నివేదించాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పంపిణీ జరగకపోగా, తెలంగాణ, గోవాల్లో వరుసగా 1 శాతం, 3శాతం పంపిణీ జరిగినట్టు అధికారులు నివేదించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది వలసదారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఆ సంఖ్యకు అనుగుణంగా కేటాయింపులు జరిపింది. అయితే వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే వారి సంఖ్య మూడు కోట్లుగా కూడా లేదని రాష్ట్రాల నుంచి వచ్చిన గణాంకాలు తెలుపుతున్నాయి. 8 కోట్ల మందిని లక్ష్యంగా పెట్లుకున్న కేంద్రం ఆ సంఖ్యకు తక్కువగా ఉన్న వలసకార్మికులకు ఉచిత ధాన్యాలను చేరవేయడంలో విఫలమైందని అధికారిక గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది.
ఎంఎస్ఎంఈలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో ప్రజలకు ఏదో ఒకటి చేస్తున్నామనే భ్రమను కల్పించే ఉద్దేశంతో దీనిని మోడీ సర్కారు తీసుకొచ్చిందే తప్పా.. దానితో సామాన్యప్రజలకు, వలసకార్మికులకు ఒరిగేది ఏమీ లేదని సామాజిక, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
Courtesy: NT