– ఇద్దరి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
– అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడండి
– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నిండు గర్భిణికి పురిటి నొప్పులొస్తే జాతీయ రహదారులకు సమీప పట్టణాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం అందజేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి, పసిబిడ్డ మరణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొంది. గర్భిణులు, ఇతర అత్యవసర కేసుల్లో వైద్య సహాయం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా మహమ్మారి నివారణకు వైద్యం చేస్తున్నా ఇతర అత్యవసర కేసుల్లోనూ వైద్యం చేయాల్సిన అవసరాన్ని మరిచిపోతే ఎలాగని ప్రశ్నించింది. గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన జనీలా అనే గర్భిణి బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరూ మరణించిన ఘటనను ప్రాథమికంగా చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది.
గద్వాల జిల్లాకు చెందిన జనీలా పురిటి నొప్పులతో పలు ఆస్పత్రులు తిరిగినా చివరికి సరైన వైద్యం అందక మరణించారని పేర్కొంటూ లాయర్ శ్రీనితా పూజారి రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి బుధవారం విచారించింది. డాక్టర్లు కరోనా నివారణకు వైద్యం చేస్తూ ఉండవచ్చునని, అయితే డెలివరీ వంటి ఎమర్జెన్సీ వైద్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైవేల పక్కన, సమీపంలోని ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో అంబులెన్స్ల ఫోన్ నెంబర్లు అందరికీ అందుబాటులో ఉంచాలంది. విచారణను 8కి వాయిదా వేసింది.
Courtesy: NT