– మీడ్డే మీల్స్కు దూరమై చిన్నారుల అవస్థలు
– యూపీలో అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి
– కోవిడ్ విజృంభణతో ఇప్పటికీ తెరుచుకోని విద్యాసంస్థలు
– ప్రత్యామ్నాయ మార్గాన్ని అమలు చేయడంలో బీజేపీ సర్కారు ఆపసోపాలు
లక్నో : దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనాను అరికట్టడం పక్కనబెడితే.. ఆ మహమ్మారి కారణంగా ప్రజలకు, విద్యార్థులకు ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలో మోడీ సర్కారు విఫలమైంది. వలసకార్మికుల కష్టాలు, నిరుద్యోగ విళయతాండవం, పడిపోయిన సగటు ఉద్యోగి ఆదాయం, అధోపాతాళానికి చేరిన జీడీపీ వంటివి మోడీ పనితీరుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఇప్పుడు కేంద్రంలో మోడీ బాటను యూపీలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులు చదివే ఈ పాఠశాలల్లో.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం(మిడ్ డే మీల్స్) ఎంతో కీలకమైంది. అయితే విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో చిన్నారుల్లో పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం పరిణమించింది.
పాఠశాలల్లో విద్యార్థులకు మిడ్డే మీల్స్ టైం టేబుల్ ప్రకారం.. పాలు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన డైట్ అమలయ్యేది. అయితే ఈ ఆపత్కాల సమయంలో యోగి సర్కారు మాత్రం మిడ్డే మీల్స్పై అంతగా శ్రద్ధ కనబర్చటం లేదు. చిన్నారుల వద్దకే మరోమార్గం ద్వారానైనా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడం లేదు. అయితే, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈవిషయంలో అన్ని రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. పాఠశాళలు తిరిగి తెరుచుకునే వరకు లబ్దిదారుల (అర్హులైన విద్యార్థులు) ఇండ్లకు నేరుగా ఆహార ధాన్యాలను కానీ, వండిన ఆహారాన్ని కానీ అందేలా చూడాలని ఆదేశించింది. అలాకాకపోతే, విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేయాలని తెలిపింది. అయినప్పటికీ యోగి సర్కారు ఆలోచనలో ఏ మార్పూ రాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన గోరఖ్పూర్ జిల్లాతో పాటు సోంభద్ర, చండౌలీ, బహ్రైచ్, గోండా, డియోరియా జిల్లాలోని విద్యార్థులు.. తమకు ఇప్పటి వరకూ రేషన్ అందలేదని వెల్లడించడం గమనార్హం.
”ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితేనే మేము విద్యార్థులకు రేషన్ను సరఫరా చేయగలం. ముఖ్యంగా ట్రైబల్ ఏరియా అయిన సోంభద్రలో ఎస్సీ, ఎస్టీలు అధికం. వారంతా చాలా పేదవారు. వీరికి రేషన్ కానీ, మిడ్డే మీల్స్ కానీ అందాల్సినవసరం ఎంతైనా ఉన్నది” అని షిల్తాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్ తెలిపారు. అయితే యోగి సర్కారుకు ఆలయాలు, గోవులపై ఉన్న శ్రద్ధ చిన్నారులకు కనీసం తినడానికి తిండి కనిపించడంలో లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Courtesy: NT