– బాధితులకు చేయూత ఇవ్వని వైనం
– కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
– అల్లర్ల సమయంలో కాల్స్కు స్పందించని పోలీసు, ఫైర్ సర్వీసులు
– ఇండ్లను విడిచి వెళ్లిన వేలాది మంది ప్రజలు.. ప్రయివేటు శిబిరాల్లో ఆశ్రయం
– ఢిల్లీ అల్లర్లపై ‘నిజ నిర్ధారణ కమిటీ‘ నివేదిక
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల బాధితులకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు తగిన సహాయ, సహకారాలు అందించడంలో విఫలమయ్యాయి. అల్లర్ల సందర్భంలో భయాందోళనలతో తమ సొంత ఇండ్లను వీడి వెళ్లిన బాధితుల కోసం కనీసం సహాయ శిబిరాలు వంటివి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపడం కోసం చేపట్టిన చర్యలు కూడా లేవు. ఢిల్లీ అల్లర్ల అనంతరం ప్రభావిత ప్రాంతాల్లో హక్కుల సంఘాల నాయకులు పర్యటించి పలువురు బాధితులతో మాట్లాడారు. అంజలీ భరద్వాజ్, అన్నీ రాజా, పూనమ్ కౌశిక్, గీతాంజలి కృష్ణ, అమృత జోహ్రి లతో కూడిన నిజ నిర్ధారణ బృందం.. భజన్పుర, చమన్పార్క్, శివ్ విహార్ లను సందర్శించింది. దీనికి సంబంధించి నివేదికను రూపొందించింది.
పట్టించకోని ప్రభుత్వాలు.. స్వచ్ఛంద సంస్థల ఔదార్యం
బాధితులకు సహాయమందించడానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే.. స్వచ్ఛంద సంస్థలు వంటివి మాత్రం తమ ఔదార్యాన్ని చాటాయి. ” కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రజలకు ఉపశమన చర్యలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయి. ప్రతి ప్రాంతంలోనూ బాధిత కుటుంబాలు వారి సొంత ఇండ్లను విడిచిపెట్టి వెళ్లాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు, సంఘాలు వంటివి వీరికి తాత్కాలిక నివాస ఏరాట్లను చేశాయి” అని బృందం వివరించింది. తాము పర్యటించిన ప్రాంతాల్లో బాధితుల కోసం కనీసం ఒక్క సహాయ శిబిరాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదని తెలిపింది. ” తిండి, బట్టలు, మందులు వంటివి కొన్ని ప్రయివేటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక ప్రజా సంఘాలు వంటివి కల్పించాయి. తాము పొందిన సహాయం గురించి ప్రజలు వివరించారు” అని నివేదికలో పేర్కొంది.
అల్లర్లతో నిరాశ్రయులైనవారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతను కూడా మరిచాయని బృందం ఆరోపించింది. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తగిన విధంగా సహాయం అందించాలనీ, బాధితుల్లో విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించేవిధంగా ఢిల్లీ సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని రెండు ప్రభుత్వాలనూ కోరింది.
బాధితులకు భద్రతతో కూడిన ఆశ్రయాన్ని కల్పించడంతో పాటు పలు రోజువారి సౌకర్యాలను కల్పించాలని బృందం సూచించింది.
అల్లర్లతో ప్రభావితమైన ప్రాంతాల్లో శిశువిహార్ ఒకటి. ఆ ప్రాంతానికి చెందిన ఓ వర్గం వారు దాదాపు వెయ్యి మంది చమన్ పార్క్లోని ప్రయివేటు హౌమ్స్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా తాము కోల్పోయిన ఇండ్లు, తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళనస్థితిలో ఉన్నారని బృందం తేల్చింది. ముఖ్యమైన పత్రాల, వస్తువులు వంటిని తిరిగి తెచ్చుకోవడం కోసం శివ విహార్కు వెళ్లిన తమ వారిపై దారుణంగా దాడి చేశారని బాధితులు వాపోయారు.
పరీక్షలపై విద్యార్థుల ఆందోళన
అల్లర్ల ప్రభావం విద్యార్థుల పైనా పడింది. ముఖ్యంగా బోర్డు ఎగ్జామ్స్ రాయబోయే పలువురు విద్యార్థులు తుది పరీక్షలు ఎలా రాయాలన్నదానిపై ఆందోళన చెందుతున్నట్టు వివరించారు. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడమే కాకుండా వారికి చెందిన పవిత్ర స్థలాలు, కట్టడాలపై మూకలు నిప్పంటించి విధ్వంసం సృష్టించాయని బృందానికి బాధితులు చెప్పారు. ఆ సమయంలో ఫైర్, పోలీసు వంటి అత్యవసర సేవలకు ఫోన్లు చేసినప్పటికి ఎవరూ స్పందించలేదని వాపోయారు.
అల్లర్లు స్థానికేతరుల పనే..!
దాడులు జరిపిన వారు స్థానికులు కారనీ, హింసాత్మక అల్లర్ల వెనుక బయటి వ్యక్తుల హస్తమున్నదని బృందం గుర్తించింది. శివ విహార్లో చెలరేగిన తీవ్ర అల్లర్ల కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇండ్లను విడిచి వెళ్లారని పౌర నాయకులు తెలిపారు. ఇటు సీలంపూర్ మెట్రో స్టేషన్కు దగ్గరలో ఉండే భజన్పురలో అనేక ఇండ్లు మూతపడి ఉన్నాయి. ఇక్కడ పోలీసు సహాయ కేంద్రానికి సమీపంలో మెయిన్రోడ్డు మీద ఉన్న మజర్కు దుండగులు నిప్పుపెట్టారు. ఓ వర్గానికి చెందిన మూడు దుకాణాలను దుండగులు తగులబెట్టారు. అంతే కాకుండా వారిపై రాళ్లతో విరుచుకుపడ్డారు. కాషాయ మూక ఇండ్లకు నిప్పంటించడంతో భవనాల నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించామని పలువురు బాధితులు తెలిపారు.
బీజేపీ నాయకుల వివాదాస్పద ప్రసంగాలపై
విచారణకు సుప్రీంకోర్టు ఓకేవివాదాస్పద వ్యాఖ్య లతో ఢిల్లీ హింసాత్మక అల్లర్లకు కారణమైన బీజేపీ నాయకులు కపిల్, మిశ్ర, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ను బుధవారం చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ మానవ హక్కుల కార్యకర్త హర్ష మందర్ ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) ఎస్.ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కోర్టు అధికారాలకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. రోజుకు ఐదుగురు చొప్పున హత్యకు గురవుతున్నారనీ, పిటిషన్ విచారణను తక్షణమే చేపట్టాలంటూ సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్స్లేవ్స్ చేసిన అభర్థన మేరకు కోర్టు ఆమోదం తెలిపింది.
24 మంది ఏఎంయూ
విద్యార్థులపై కేసు
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొందరు కాశ్మీరీ విద్యార్థులతో పాటు మొత్తం 24 మంది ఉన్నారు. సీఏఏ నిరసనల్లో పాల్గొనడమే కాకుండా.. జీవన్గఢ్లోని ప్రధానమైన రోడ్డును దిగ్బంధించిన ఏఎంయూ విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అలీగఢ్ పోలీసు అధికారి అనిల్ సమానియా తెలిపారు. వీరిలో ఏఎంయూఎస్యూ మాజీ వైస్ ప్రెసిడెంట్ సజ్జద్ రథర్ కూడా ఉన్నారు.
ఇక జనాభా నియంత్రణ చట్టం
– కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తర్వాత కేంద్రం తీసుకురాబోయేది జనాభా నియంత్రణ చట్టమే అని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. ఈ అంశంపై తానిప్పటికే ప్రధాని మోడీతో మాట్లాడానని చెప్పారు. ఈ విషయం ప్రధాని పరిగణలో ఉన్నదని తాను విశ్వసిస్తున్నాననీ, సదరు చట్టం ప్రాముఖ్యతపై ప్రధాని తనకు తానే చర్చించుకున్నారని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మథుర వచ్చిన సాధ్వి.. పై వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హౌదాను కల్పించే ఆర్టికల్ 370ని ప్రధానిరద్దు చేసిన తర్వాత.. దేశానికి ముఖ్యమైన ఏ చట్టాన్నైనా మోడీ తీసుకురాగలరని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నట్టు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నావో ఎంపీ, బీజేపీ వివాదాస్పద నాయకుడు సాక్షి మహారాజ్ కూడా ఉన్నారు.
ఇంటెలిజెన్స్ అధికారి కుటుంబానికి రూ.కోటి పరిహారం : ఢిల్లీ సీఎం
ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కుటుంబానికి రూ. కోటి పరిహారాన్ని అందచేస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. రాజధానిలో చెలరేగిన ఘర్షణల్లో మ్తొం 46 మంది మృతిచెందగా, 200 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ‘అంకిత్ శర్మ ఎంతో ధైర్యసాహసాలు కలిగిన, గర్వించతగిన వ్యక్తి. అల్లర్లలో అతనిని అతి క్రూరంగా హత్య చేశారు. ఆ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కఁటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం’ అని కేజ్రీవాల్ ట్వీట్చేశారు.
– భారత్ను విడిచి వెళ్లు
– పోలాండ్ విద్యార్థికి ఎఫ్ఆర్ఆర్ఓ నోటీసు
– సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ఎఫెక్ట్
కోల్కతా : సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నందుకు కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ(జేయూ)లో చదువుకుంటున్న పోలాండ్ విద్యార్థిపై వేటు పడింది. పదిహేను రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఫారీనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ) నోటీసులు పంపింది. జేయూలోని కంపేరేటీవ్ లిటేరేచర్ విభాగంలో కమిల్ సీడ్సింక్సీ అనే విద్యార్థి పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సెంట్రల్ కోల్కతాలో గత డిసెంబర్ 19న నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కమిల్ పాల్గొన్నారని ఆరోపిస్తూ ఆయనకు గత నెల 22న సంబంధిత అధికారులు నోటీసును పంపారని జేయూ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై పోలాండ్ ఎంబసీకి కమిల్ తెలిపారు. తాను నిరసనల్లో పాల్గొనలేదనీ, ఆందోళనలకు సంబంధించిన ఫోటోలు తీసేందుకే తాను అక్కడకు వెళ్లాననీ, నోటీసు విషయంలో పునరాలోచించాలంటూ ఎఫ్ఆర్ఆర్ఓను కోరారు.
సీఏఏ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు విశ్వభారతీ యూనివర్సిటీకి చెందిన బంగ్లాదేశ్ విద్యార్థిని అఫ్సరా అనికా మీమ్కు కోల్కతా ఎఫ్ఆర్ఆర్ఓ తొలి సారిగా ఇలాంటి నోటీసునే గతనెల 14ను పంపింది.
Courtesy Nava telangana