– ఇప్పుడు అన్లాక్ దశ ప్రారంభం..
– సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో మోడీ
– ప్రధానిని స్పష్టత కోరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి, అన్లాక్ల దశ ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. బుధవారం ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ”దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరు అని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ”దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్డౌన్ ముగిసింది. అన్లాక్ 1.0 నడుస్తున్నది. అన్లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ”కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పని చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుంది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి వెళ్లైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావ డానికి సిద్ధమవుతున్నారు” అని సీఎం ప్రధానికి చెప్పారు. బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్టు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా స్పందించారు. ”నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) కూడా మీ బీహార్ వారే. దయచేసి పంపించండి” అని కేసీఆర్ అన్నారు.
– ఒకేరోజు రెండువేల మరణాలు
– మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో అధికం
– దేశంలో మొత్తం 3.54 లక్షల కేసులు..
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తున్నది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 2,003 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 12 వేలకు చేరువైంది. దేశంలో ఒకేరోజున ఇంత ఎక్కువ సంఖ్యలో కరోనాతో ప్రాణాలు కల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మరణాల సంఖ్య 11,903కు చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 3,54,065కు చేరింది. వీటిలో 1,55,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 1,86,935 మంది కోలుకున్నారు. కేసులు విషయంలో మహారాష్ట్ర (1,13,445), తమిళనాడు (50,193), ఢిల్లీ (44,668), గుజరాత్ (24,577), ఉత్తరప్రదేశ్ (15,181) రాష్ట్రాలు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అలాగే, వైరస్ మరణాల్లో మహారాష్ట్ర (5,537), ఢిల్లీ (1,837), గుజరాత్ (1,533) రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
సరైన చర్యలతోనే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాం..
వైద్యసదుపాయాలు విస్తరించాలి : ప్రధాని
కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చాలా రాష్ట్రాలు ప్రశంసనీయంగా పని చేస్తున్నాయని, ఆయా రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను మిగతా రాష్ట్రాలు తప్పక స్వీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ప్రతి రాష్ట్రం తన అనుభవాన్ని, సలహాలను బహిరంగంగా ఉంచుతున్నదని, రాబోయే రోజుల్లో మెరుగైన వ్యూహాన్ని చేపట్టడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతోనూ, ఉన్నతాధి కారులతోనూ మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. తొలుత ఇండియా-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘటనలో మరణించిన వీర సైనికులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు.
కొన్ని పెద్ద రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో కొన్ని పెద్ద రాష్ట్రాలు, పెద్ద నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. సకాలంలో గుర్తించడం, చికిత్స అందించడం వల్ల కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నదని, చాలా తక్కువ మంది రోగులకు మాత్రమే ఐసీయూ, వెంటిలేటర్ సంరక్షణ అవసరం పడుతుందని అన్నారు. మూడు నెలల క్రితం భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో పీపీఇలు, డయాగ్నొస్టిక్ కిట్ల కోసం వాగ్వాదం జరిగిందని, దేశంలో కూడా పరిమిత స్టాక్ ఉందని, ఎందుకంటే మనం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉన్నామని తెలిపారు. పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్యసదుపాయాలను విస్తరించాలని అన్నారు. రుతుపవనాలు కదులుతున్నాయని గుర్తించాలని, ఈ సీజన్లో మిగిలిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కూడా చాలా ముఖ్యమని, లేకపోతే అవి పెద్ద సవాలుగా మారతాయని అన్నారు. తనకు మాట్లాడే అవకాశం లేకపోవడం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు.
Courtesy: NT