మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు సిద్ధమవుతున్న హైదరాబాద్ సంస్థ
సంచాలకులు డాక్టర్ మనోహర్ వెల్లడి
హైదరాబాద్: భారత్ బయోటెక్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ని మనుషులపై ప్రయోగించడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లినికల్ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్లోని నిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులను ఎంపిక చేయగా.. నిమ్స్లో ఈ నెల 7 నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్ శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన క్లినికల్ ప్రయోగాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మనుషులపై మొదటి దశ (ఫేజ్01) ప్రయోగాలకు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. ఇందుకు ఐసీఎంఆర్ బడ్జెట్ విడుదల చేసిందన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నైతిక విలువల కమిటీ సమావేశం
ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైంది. టీకా ప్రయోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. కమిటీ నిర్ణయాలను నివేదిక రూపంలో ఐసీఎంఆర్కు అందజేస్తాం. అక్కడి నుంచి అనుమతి రాగానే మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తాం. టీకా ప్రయోగాలకు ముందుకొచ్చిన (పరీక్షార్థుల) వాలంటీర్లకు తొలుత వైద్యపరీక్షలు నిర్వహిస్తాం. వారి రక్తనమూనాలు, స్వాబ్ను సేకరించి ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన దిల్లీలోని వైద్య పరీక్షాకేంద్రానికి పంపుతాం. అక్కడి నుంచి నివేదిక వచ్చాక ఇక్కడి వైద్య విభాగం స్క్రీనింగ్ చేస్తుంది. వైద్యపరీక్ష నివేదికను పూర్తిగా విశ్లేషించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఎంపికైన వారిపై క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తాం.
మూడు రకాలుగా విభజన
క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఇక్కడకు మూడు రకాల వ్యాక్సిన్లు కోడ్తో వస్తాయి. వీటిలో ఒకటి 3 మైక్రోగ్రాములు, రెండోది 6 మైక్రోగ్రాములు, మూడో వ్యాక్సిన్ ప్లాసిబోగా ఉంటుంది. వీటిని ఎవరెవరికి ఏయే డోస్ ఇవ్వాలనేది నిర్ణయిస్తాం. మళ్లీ 14 రోజుల తరువాత వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అదే కోడ్ ఉన్న వ్యాక్సిన్ వేస్తాం. క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వాలంటీర్లకు నిమ్స్లో ప్రత్యేకంగా ఐసీసీయూ వార్డు ఏర్పాటు చేశాం. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత రెండ్రోజులపాటు ఐసీసీయూలో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తాం. దీనికోసం ప్రత్యేకంగా నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ సారథ్యంలో వైద్యుల బృందం పనిచేస్తుంది. రెండ్రోజుల తరువాత వారికి పూర్తి వైద్యపరీక్షలు నిర్వహించాకే ఇంటికి పంపుతాం. ఆ తరువాత 14 రోజులు ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తాం. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో 30-60 మందిపై ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రయోగాలలో భాగం అవుతామంటూ ఎంతోమంది ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తున్నారు. చాలా ఫోన్కాల్స్ వస్తున్నాయి.
- పంజాగుట్ట నిమ్స్లో నిర్వహించే కీలకమైన క్లినికల్ ట్రయల్స్కు నోడల్ అధికారిగా ఆసుపత్రి అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్రెడ్డిని నియమించారు.
Courtesy Eenadu