-డేటాబేస్ లో 20 వేల మంది బీపీఎల్ కార్డుదారుల పేర్ల గల్లంతు
-జాబితాలో భోపాల్ గ్యాస్ బాధితులు
– ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్న బీజేపీ సర్కార్
భోపాల్ : కరోనా వ్యాప్తిని నివారించడానికి దేశంలో విధిస్తున్న లాక్డౌన్ లతో ఓవైపు ప్రజలు ఆకలి బాధలతో అలమటిస్తుంటే.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలపై మరింత కాఠిన్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కాలంలో పేదల ఆకలి తీర్చాల్సింది పోయి.. వారికి ఆ మాత్రం సాయం కూడా అందకుండా చేస్తున్నది. భోపాల్ లో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న సుమారు 20 వేల మంది పేర్లను ప్రభుత్వ డేటాబేస్ నుంచి తొలగించింది. పేర్లు తీసేసిన వారిలో మెజారిటీ ప్రజలు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులే ఉండటం గమనార్హం.
వివరాల్లోకెళ్తే.. రేషన్ పొందడానికి అందించే బీపీఎల్ కార్డులు, వైద్య, పింఛన్, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ అందేందుకు గాను లబ్దిదారుల సమాచారాన్ని సమగ్ర సామాజిక సురక్ష మిషన్ (ఎస్ఎస్ఎస్ఎం) డేటాబేస్ లో నిక్షిప్తం చేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో భోపాల్ కు చెందిన 20 వేల మంది వివరాలను ఈ డేటాబేస్ నుంచి తొలగించారనీ, ఇందులో భోపాల్ గ్యాస్ బాధితులే ఎక్కువగా ఉన్నారని ‘ది గ్యాస్ పీడిత్ నిరాషిత్ భోగి సంఘటన మోర్చా’ ఆరోపించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి బిసాహుల్లాల్ సింగ్ ను కలిసి, ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తీసేసిన పేర్లలో చాలామంది వితంతు మహిళలు, గ్యాస్ దుర్ఘటన బాధితులు, వికలాంగులు, అణగారిన వర్గాల ప్రజలు ఉన్నారనీ.. లాక్డౌన్ కాలంలో వారికి చేయడానికి పని దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయనకు వివరించారు. తొలగించిన వారందర్ని తిరిగి డేటాబేస్ లో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించారు. ఇదిలాఉండగా.. రెండేండ్ల క్రితమే వారికి బీపీఎల్ కార్డులను ప్రభుత్వం అందజేసిందని ఆ సంస్థ ప్రతినిధి బాలకృష్ణ నాందేవ్ తెలిపారు.
కార్డులిచ్చి రెండేండ్లయినా లబ్దిదారులకు రేషన్ అందడం లేదని ఆయన ఆరోపించారు. వారిలో చాలామంది వేలి ముద్రలు పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ లో జతకలవడంలేదనీ, దీంతో వారికి రేషన్ షాప్ ఓనర్లు స్లిప్పులు అందించడంలేదని అన్నారు. ఇదే విషయమై జిల్లా ఆహార సంబంధాల అధికారి జ్యోతి షా ను వివరణ కోరగా.. ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని 15 వేల మంది పేర్లను తొలగించామని చెప్పడం గమనార్హం.
Courtesy: NT