నల్లమల పశువులకు జాతీయ గుర్తింపు
వనరాజా కోళ్లకు సైతం..
జాతీయ పశు జన్యు వనరుల మండలి ప్రకటన
హైదరాబాద్, అమ్రాబాద్, న్యూస్టుడే: తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో అధికంగా కనిపించే పొడ తూర్పు జాతి పశువులకు అరుదైన దేశీయ పశుజాతిగా గుర్తింపు లభించింది. భారత్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ.. ప్రత్యేకతలను సొంతం చేసుకున్న దేశీయ పశువులు, కోళ్లజాతులను భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)కు చెందిన జాతీయ పశు జన్యువనరుల మండలి గుర్తిస్తుంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తం 197 జాతులను గుర్తించగా.. వాటిల్లో 50 రకాల పశువులు, 17 దున్నపోతులు, 44 గొర్రెలు, 7 గుర్రాలు, 9 ఒంటెలు, 10 పందులు, 19 కోళ్లు, 3 రకాల బాతులు తదితరాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని తూర్పు జాతి పశువుల ప్రత్యేకతను వివరిస్తూ.. వాటిని అరుదైన దేశీయ జాతి పశువులుగా గుర్తించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గతంలో ఐసీఏఆర్కు ప్రతిపాదనలను పంపింది. ఐసీఏఆర్కు చెందిన జాతీయ కమిటీ ఈ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించడంతో తాజాగా ప్రత్యేక గుర్తింపు లభించింది.
వనరాజా కోళ్లకు సైతం
* హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ కోళ్ల పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ‘వనరాజ కోడి’ని సైతం తాజా గుర్తిస్తున్నట్లు జాతీయ పశు జన్యువనరుల మండలి ప్రకటించింది. ఈ కోడిని 40 వారాల పాటు పెంచితే గరిష్ఠంగా 3.5 కిలోల వరకు బరువు తూగుతుంది. ప్రతి ఏటా గరిష్ఠంగా 215 గుడ్లు పెడుతుంది.
Courtesy Eenadu