– హిందువు పాడి మోసిన ముస్లింలు
– జైపూర్లో ఘటన
జైపూర్ : కరోనా భయంతో జనం వణికిపోతున్నారు. కనీసం చనిపోతే కూడా వెళ్ళి చూసే పరిస్థితులు నేడు కానరావటంలేదు. రాజస్థాన్లోని జైపూర్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రాజేంద్ర బగ్రీ (35) ఆదివారం రాత్రి మృతిచెందాడు. బంధువులెవరూ రాలేదు. భార్య, పిల్లలు, మృతుడి సోదరుడు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆదుకునేవారు లేక ఆ కుటుంబం అల్లాడింది. విషయం తెలిసిన పొరుగింటివారైన ముస్లింలు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘రామ్ నామ్ సత్య హై’ అంటూ నినాదం చేస్తూ పాడె మోశారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. ‘దీర్ఘకాలంగా అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. ఆదివారం చనిపోయాడు. బంధువులెవరూ రాలేదు. అందువల్ల ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించాం’ అని పప్పు అనే యుస్లిం యువకుడు చెప్పారు. కులం, మతం కంటే మానత్వం గొప్పదన్న బలమైన సందేశాన్ని ఇస్తున్నది. లాక్డౌన్ నేపథ్యంలో ఇలాంటి అరుదైన పలు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇదే తరహాలో హిందువు అంత్యక్రియలను ముస్లింలు నిర్వహించారు.
Courtesy: NT