– కులం పేరుతో దూషిస్తూ సర్పంచ్ ని తీవ్రంగా గాయపర్చిన కోటేశ్వర్ కుటుంబ సభ్యులు
వర్ధన్నపేట : దళిత సర్పంచ్ను కులం పేరుతో దూషిస్తూ హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోటేశ్వర్, అతని సోదరునికి కొంతకాలంగా భూతగాదాలున్నాయి. ఈ విషయమై ఇరువురు పోలీస్స్టేషన్లో కేసు కూడా పెట్టుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించుకోవాలన్న అధికారులు, గ్రామస్థుల సూచన మేరకు సర్పంచ్ మంద సతీశ్ను పంచాయతీ తీర్మానానికి రావాలని కోరడంతో వెళ్లారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సోమవారం ఉదయం పంచాయితీ పెట్టారు. ఇరుపక్షాల పెద్దమనుషుల సమక్షంలో సర్పంచ్ సతీశ్ మాట్లాడుతున్న సందర్భంలో కోటేశ్వర్ అతని కుటుంబ సభ్యులు ‘మాదిగ సర్పంచివి నీవు’ అంటూ కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా గాయపర్చారు. మొదటి నుంచి అవతలి వారికే సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాళ్లతో తల, మొఖంపై దాడి చేయడంతో 4 పళ్లు విరిగాయి. తీవ్ర రక్తస్రావంతో పోలీస్స్టేషన్లోకి వచ్చిన సర్పంచ్ని ఎస్ఐ వంశీకృష్ణ తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. సర్పంచ్ మంద సతీశ్పై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా భూ తగాదా విషయంలో గ్రామస్థులు, బాధితుల కోరిక మేరకు పంచాయతీ తీర్మానం కోసం వెళ్ళిన సర్పంచ్పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.