- ముంబైలో నిబంధనలు బేఖాతరు.. తిరిగి కర్ఫ్యూ
- జనం ఎగబడడంతో మద్యం దుకాణాలు బంద్
- అహ్మదాబాద్లో పాలు, మందులకే అనుమతి
- కూరగాయలు, పండ్ల షాపులు సైతం మూసివేత
- మహారాష్ట్రలో ఒక్కరోజే 1,233 కేసులు
- ముంబైలో 10 వేలు, దేశంలో 50 వేలు దాటాయి
- కేంద్ర బలగాల్లో 400 మందికి సోకిన వైరస్
- సాయంత్రం బులెటిన్ ఇవ్వని కేంద్ర ఆరోగ్య శాఖ
- బెంగాల్లో 92 వేల మందిలో ఫ్లూ లక్షణాలు: సర్వే
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడని ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో ‘లాక్డౌన్ సడలింపులు’ రద్దయ్యాయి. వేలల్లో కరోనా కేసులు నమోదైన రెండు చోట్లా మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కేంద్ర సాయుధ బలగాలనూ కరోనా వెంటాడుతోంది. పారామిలిటరీ దళాల్లో కేసులు 400కు పెరిగాయి. తన సిబ్బందిని రక్షించుకునేందుకు, కరోనాపై పోరుకు సీఆర్పీఎఫ్ ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటి దాకా సీఆర్పీఎ్ఫ లో 161 కేసులు నమోదయ్యాయి. మరో 85 మంది బీఎ్సఎఫ్ జవాన్లకు వైరస్ సోకింది. ఆ విభాగంలో కేసులు 154కు చేరాయి. బుధవారం మహారాష్ట్రలో అత్యధికంగా 1,233 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో ఒకే రోజు 771 కేసు లు వెలుగు చూశాయి. కొత్త కేసులన్నీ దాదాపుగా కోయంబేడు నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా నమోదైనవే. రాజస్థాన్లో 159, కర్ణాటకలో 20కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసులు 52 వేలు దాటాయి. కరోనా కేసులు, మరణాలపై రోజూ సాయంత్రం తాజా సమాచారం ఇచ్చే కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయపు సమాచా రంతో సరిపెట్టుకుంది. దాని ప్ర కారం దేశంలో మంగళవారం ఉదయం నుంచి 126 మరణాలు, 2,958 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,694కు, కేసులు 49,391కు పెరిగాయని పేర్కొంది. 24 గంటల్లో 1,457 మంది కోలుకొన్నారని, రికవరీ రేటు 28.72ుకు పెరిగిందని తెలిపింది. కేరళలో బుధవారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. తమ రాష్ట్రంలో 30 రోజులే చికిత్స పొందుతున్నారని విజయన్ ప్రభుత్వం తెలిపింది.
పట్టపగ్గాల్లేని ముంబైకర్లు
10 వేల కేసులతో రెడ్జోన్లో ఉన్న ముంబైలో సోమవారం మద్యం దుకాణా లు తెరవగానే జనం ఎగబడ్డారు. భౌతిక దూరం నిబంధనను గాలికొదిలి పోటీపడ్డారు. పరిస్థితి దిగజారిపోతుందన్న ఆందోళనతో ముంబైలో లాక్డౌన్ సడలింపులను రద్దు చేసి మళ్లీ కర్ఫ్యూ విధిస్తున్న ట్లు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. మద్యం దుకాణాలను మూసేయించింది. కిరాణా, మెడికల్ షాపులు తప్ప ఇతర దుకాణాలను తెరవరాదని ఆదేశిం చింది. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో 1,233 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 16,758కి పెరిగాయి. మరో 34 మంది కరోనా రోగులు మృతిచెందారు. వీరిలో 25 మంది ముంబైకి చెందిన వారే. దీంతో మరణాల సంఖ్య రాష్ట్రంలో 651కి, ముంబైలో 412కు చేరింది.
548 మంది వైద్య సిబ్బందికి కరోనా
దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వీరికి వైరస్ ఆస్పత్రుల్లోనే సంక్రమించిందా.. బయటా సోకిందా అనే విషయంపై దర్యాప్తు నిర్వహించలేదని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఢిల్లీలోనే 69 మంది వైద్యులు వైరస్ బారినపడ్డారు. భోపాల్లో కరోనా సోకి మరణించిన 17 మందిలో 15 మంది 1984 గ్యాస్ లీకేజీ ఘటన బాధితులేనని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. క్వారంటైన్ను పూర్తి చేసుకున్న 4 వేల మంది తబ్లీగీలను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వీరిని దర్యాప్తు కోసం పోలీసు కస్టడీకి పంపనున్నారు.
బలగాలు సతమతం
ఇటీవల ఢిల్లీలో పనిచేసిన 30 మంది బీఎ్సఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. దీంతో ఆ బృందంలోని 65 మంది జవాన్లనూ రాజస్థాన్లోని జోధ్పూర్కు తరలించారు. వైరస్ సోకిన వారిని ఎయిమ్స్లో చేర్పించారు. మిగతా వారిని క్వారంటైన్లో ఉంచారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి ఎస్కార్ట్గా పనిచేసిన వారిలో ఆరుగురికి, త్రిపుర దళంలో 37 మంది జవాన్లకు కూడా కరోనా సోకింది. దీంతో వైరస్ బారినపడిన సిబ్బంది సంఖ్య 154కు చేరింది. సీఆర్పీఎ్ఫలో కేసులు 161కు పెరిగాయి.
అహ్మదాబాద్లో అలజడి
మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కరోనా కేసులు గుజరాత్లోనే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న అహ్మదాబాద్లో దుకాణాలను మూసివేయాలని ఇన్చార్జి మునిసిపల్ కమిషనర్ ముఖేశ్ కుమార్ ఆదేశించా రు. ఈ నెల 7 అర్ధరాత్రి నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పాలు, మందుల షాపులు తప్ప ఇతరాలు తెరవకూడదన్నారు. కూరగాయలు, పండ్లు, కిరాణా షాపులకు సైతం మినహాయింపు లేదు. ఆందోళన చెంది న ప్రజలు సరుకులు, కూరగాయల కోసం దుకాణాలకు పోటెత్తారు. కమిషనర్ విజయ్ నెహ్రా 14 రోజులు హోం క్వారంటైన్లోకి వెళ్లడంతో ఇన్చార్జిగా ముఖేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం అహ్మదాబాద్లో తాజాగా 291 కేసులు నమోదయ్యాయి. 25 మంది మరణించారు. మొ త్తం కేసులు 4,735కు, మరణాలు 298కి పెరిగాయి.
Courtesy Andhrajyothi