– లాక్డౌన్ విధించి నెల రోజులు గడిచినా వలసకార్మికులకు దక్కని సాయం
– 80 శాతం మందికి అందని రేషన్..
– జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలు టాప్
-78 శాతం మంది కార్మికులకు అందని వేతనాలు
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ విధించిన అనంతరం తలెత్తిన పరిస్థితులతో వలసకార్మికులను ఆదుకుంటామని చెప్పి మోడీ సర్కారు ప్రకటించిన ఉపశమన పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గతనెల 26 నాటికి లాక్డౌన్ ప్రకటించి నెల రోజులు గడిచినా.. కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా (పీఎంజీకే) ఫలాలతో పాటు కనీస అవసరాలైన రేషన్ కూడా ఎక్కువ మందికి అందడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 26 నాటికి 80 శాతం మంది వలస కూలీలకు రేషన్ అందకపోగా.. 68 శాతం మంది కార్మికులకు వండుకోవడానికి నిత్యావసరాలు సరుకులు లేవని వీరి సమస్యలపై పోరాడుతున్న స్వచ్చంధ సంస్థ స్టాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (స్వాన్) ఇటీవల వెలువరించిన ఒక నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 17 వేల మందిని సంప్రదించి ఈ సర్వేను చేపట్టగా.. వీరిలో 4 వేల మంది మహిళా కార్మికులూ ఉన్నారు.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. ప్రతి ఐదుగురు కార్మికుల్లో నలుగురు వలస కార్మికులు తమకు ప్రభుత్వం అందించిన రేషన్ సరుకులు అందలేదని తెలిపారు. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి లక్షలాదిగా వలస కూలీలు తమ స్వగ్రామాలకు తరలిపోతున్నారు. అయితే వీరిలో చాలా మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) నుంచి రావాల్సిన నిత్యావసరాలు అందడం లేదు. ఏప్రిల్ 14 నాటికి మహారాష్ట్రలో 94 శాతం మంది వలస కూలీలు తమకు రేషన్ రాలేదని తెలపగా.. ఏప్రిల్ 26 నాటికి ఆ సంఖ్య 96 శాతానికి పెరగడం గమనార్హం. ఢిల్లీ, హర్యానాలు సైతం ఇదే విధంగా ఉన్నాయి. గతనెల 14 నాటికి హర్యానాలో 81.8 శాతం మంది వలస కూలీలకు రేషన్ రాకపోగా.. పదిహేను రోజులు గడిచిన తర్వాత అది 92.5 శాతానికి చేరింది. పారిశ్రామిక హబ్లుగా పిలిచే ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల్లో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తుండటం గమనార్హం.
నగదు సాయం ఉత్తమాటే…
లాక్డౌన్ కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడమే గాక యాజమాన్యాలు సైతం చాలా మంది కార్మికులకు వేతనాలు చెల్లించలేదు. అయితే వీరిని పీఎంజీకే ద్వారా ఆదుకుంటామని కేంద్రం ప్రకటించింది. కానీ స్వాన్ సంప్రదించినవారిలో 64 శాతం మంది కార్మికుల దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పగా.. 78 శాతం మంది రూ. 300 కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సుమారు 97 శాతం కార్మికులు (10,383 మంది) తమకు కేంద్రం నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ చిల్లిగవ్వ కూడా రాలేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే పనులు చేసినా వేతనాలు అందనివారూ భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఏప్రిల్ 26 నాటికి 6 శాతం మంది వలస కూలీలు మాత్రమే యాజమాన్యాలు తమకు పూర్తి వేతనాలు ఇచ్చాయని తెలిపారు. 78 శాతం మంది కార్మికులు.. తమకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్వయం ఉపాధి చేసుకుని జీవించే రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు వంటి వాళ్లు.. లాక్డౌన్ కారణంగా తాము ఎలాంటి ఆదాయమూ పొందలేదని 99 శాతం మంది అన్నారు.
పొంతనలేని ప్రభుత్వ లెక్కలు
దేశవ్యాప్త మూసివేత సందర్భంగా సర్వం కోల్పోయిన భవన నిర్మాణరంగ కార్మికులను ఆదుకుంటామని మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు పీఎంజీకే కింద వారికి రూ. 1.70 లక్షల కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అసంఘటితరంగ కార్మికులు, వలస కూలీలకు కొంత నగదుసాయం ప్రకటిస్తున్నట్టు ప్రకటించాయి. కానీ ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 1.42 లక్షల కోట్లు ఖర్చు చేశాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కేంద్రం విడుదల చేస్తామన్న దాని కంటే తక్కువే విదిల్చిందని దీని ద్వారా స్పష్టమవుతున్నది.
ఇక భవన నిర్మాణరంగ కార్మికులకు తలా ఒకరికి రూ. 1,500 ప్రకటిస్తామని చెప్పినా.. ఈ రంగంలో ఉన్నవారిలో లక్షలాది మంది ఇప్పటికీ రిజిష్టర్ చేసుకోనివారే. గుర్తింపు కార్డు లేని వారికి ప్రభుత్వ సాయం అందించలేమని అధికారులు చెబుతుండటంతో నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వ సాయం కాగితాలకే పరిమితమైపోతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కండ్లు తెరిచి వలస కార్మికులను ఆదుకోవాలని సూచించారు. కేరళలో కార్మికులకు అందజేస్తున్నట్టుగా ఇంటివద్దకే నిత్యావసర సరుకులు, మందులు, ఉడకబెట్టిన ఆహారాన్ని సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక పేదల ఆకలి తీర్చే ‘అన్నపూర్ణ’ కేంద్రాలను మూసేయకుండా వాటి ద్వారా పేదల కడుపు నింపాలని కోరుతున్నారు.
Courtesy: NT