– సూరత్లో కూలీల ఆందోళన
– లాక్డౌన్ పొడిగింపు వార్తలతో ఆవేదన
– పోలీసుల లాఠీచార్జి.. కార్మికుల ఆగ్రహం కూరగాయల బండ్లకు నిప్పు
– సొంత ఊర్లకు పంపించాలని డిమాండ్
– 80 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గాంధీనగర్ : ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో వలస కార్మికులు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగిస్తారని వార్తలు వస్తుండటం, ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనకు గురైన కార్మికులు శుక్రవారం రాత్రి సూరత్లోని లసనక ఏరియాలో ఆందోళనకు దిగారు. తక్షణమే జీతాలు ఇప్పించి, తమను సొంతూళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే… వలసకార్మికులకు కేంద్రమైన సూరత్లో వస్త్ర, పవర్లూమ్, నిర్మాణ రంగంలో వేలాదిగా ఉన్న కార్మికుల్లో చాలా మంది వసతి గృహాల్లో కనీస వసతుల్లేక కాలం వెల్లదీస్తున్నారు. కేంద్రం విధించిన 21 రోజుల లాక్డౌన్ను పొడిగిస్తారనే వార్తల నేపథ్యంలో వారంతా శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు.
కొద్దిరోజులుగా పనుల్లేకపోవడంతో తామంతా ఇక్కడే చిక్కుకుపోయామనీ, తమ గురించి ఇంటి దగ్గర ఉన్నవాళ్లు ఆందోళన చెందుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా సదుపాయం కల్పించి తమను తక్షణమే సొంత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. వందలాదిగా వచ్చిన కార్మికులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీకి దిగారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణతో వారిని చితకబాదారు.
దీంతో ఆగ్రహించిన కార్మికులు అక్కడే ఉన్న కూరగాయల బండ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే విషయమై సూరత్ డిప్యూటీ కమిషనర్ రాకేశ్ బరొట్ మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్మికులు రోడ్లను దిగ్బంధం చేసి పోలీసులపై రాళ్లు రువ్వారని ఆరోపించారు.
వలస కార్మికులకు ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశామనీ, కానీ వారంతా తమను సొంత ప్రాంతాలకు పంపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాగా, ఆందోళనకు దిగినవారిలో ఎక్కువ మంది ఒడిషాకు చెందిన కార్మికులే ఉన్నారు. ఒడిషాలో ఇప్పటికే లాక్డౌన్ను పొడిగించడం.. దేశవ్యాప్తంగానూ దీన్ని కొనసాగిస్తారని వార్తలు వస్తుండటంతో వారు రోడ్లను దిగ్బంధం చేసి ఆందోళనకు దిగారు.
Courtesy: NT