- ఎవ్వరైనా ఇళ్ల నుంచి బయటకొస్తే వేసుకోవాల్సిందే
- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
- కరోనా సోకినా లక్షణాలు బయటపడకపోవడంతోనే నిర్ణయం
- మాస్కులు ధరించినా సామాజిక దూరం పాటించాల్సిందే
హైదరాబాద్ : కూరగాయలు కొనేందుకనో.. మెడికల్ షాపునకు వెళ్లేందుకనో ఇంట్లోంచి బయటకు వెళుతున్నారా? జేబుల్లో పర్సు, మొబైల్ ఉందో లేదో చూసుకున్నట్లే ముఖానికి మాస్కు ఉందో లేదో కూడా చూసుకోండి! కాలనీలో దగ్గరే కదా అని నగర వాసులు.. పొలానికే కదా వెళుతోందని గ్రామీణ ప్రజలు ఎవ్వరూ మాస్కులెందుకులే అని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే కరోనా వైర్సను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రజలంతా మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవ్వరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులను కచ్చితంగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కొందరిలో కరోనా లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ ఫలితాల్లో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరుగుతోంది. ఇలాంటి వారు మాస్కు లేకుండా బయకు వెళుతుండటంతో ఇతరులకు వైరస్ సోకుతోందని ఇటీవల జపాన్లో జరిపిన ఓ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణంగా వైరస్ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం ఉండటంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజలంతా మాస్కులను ధరించేలా జిల్లా కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యల్ని తీసుకోవాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. మాస్కుల ధారణ, తొలగింపు విషయంలో ప్రత్యేకంగా సూచనలు కూడా చేసింది.
మాస్కుల ధారణలో సూచనలు ఇవీ
- ముక్కు, మూతిని పూర్తిగా కవర్ చేసేలా మాస్కు ధరించాలి.
- ఉద్యోగస్తులందరూ మాస్కులను ధరించాలి.
- బయట పనిచేసే ప్రతి వర్కర్ తప్పని సరిగా మాస్కులను ఉపయోగించాలి
- గ్రామీణ ప్రాంతాల వారు కూడా బయటకు వస్తే తప్పని సరిగ్గా మాస్కులను ధరించాలి
- మాస్కులను తొలగించాక చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
- మాస్కును ఒకవైపే వేసుకోవాలి. ఒక్కసారి ఉపయోగించే మాస్కులను ఆరుగంటలకు ఒకసారి కొత్తది వేసుకోవాలి.
- ఉపయోగించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మూసి ఉన్న చెత్తడబ్బాల్లోనే వేయాలి.
- మాస్కు ధరించినంత తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించాలి.
Courtesy Andhrajyothi