- ఆ కుటుంబాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు
- కరీంనగర్ జిల్లా వాసి అంజిరెడ్డి చొరవ
- 10 రోజుల క్రితం ఏర్పాటు.. భారీగా స్పందన
- ఇప్పటిదాకా ఐదువేల దాకా ఫోన్ కాల్స్
కరీంనగర్, తిమ్మాపూర్ : మీ అబ్బాయి యవుసం చేస్తున్నాడా? పెళ్లి సంబంధాలెన్ని చూస్తున్నా కుదరడం లేదా? పొలం పనులు చేస్తున్నాడు.. రైతు అన్న ఒక్క కారణంతోనే అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదా? మీలాంటి వారి కోసమే ప్రత్యేకంగా మ్యారేజ్ బ్యూరో ఏర్పాటైంది. ఎక్కడంటారా? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో! నిర్వాహకుడి పేరు కేతిరెడ్డి అంజిరెడ్డి.
నెత్తికి రుమాలు.. నడుమకు తువాలు చుట్టి.. నాగలి పట్టి. దుక్కి దున్ని.. తుకం పోసి.. నాట్లు వేసి.. కలుపు తీసి.. కోత కోసి.. ఆ ధాన్యంతో తాను బతుకుతూ.. కుటుంబాన్ని పోషిస్తూ.. ప్రజలందరి ఆకలి తీరుస్తున్న రైతులకు పెళ్లిళ్లు కాకపోవడమేమిటి? నెలకు రూ.10వేలు సంపాదించేవారికైనా పిల్లనిస్తున్నారు తప్ప మంచి దిగుబడులతో అంతకన్నా ఎక్కువే సంపాదిస్తున్న పదెకరాల ఆసామికి కూడా ఎందుకు పిల్లనిస్తలేరు? అన్న ఆవేదన.. దాంట్లోంచి పుట్టిన ఆలోచనే అంజిరెడ్డిని మ్యారేజీ బ్యూరో ఏర్పాటు దిశగా పురిగొల్పింది. మ్యారేజీ బ్యూరో ఏర్పాటై కూడా 10 రోజులైంది. పెళ్లి సంబంధాల కోసం ఎంతో మంది అక్కడికొచ్చి ఆయన్ను సంప్రదిస్తున్నారు.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో అంజిరెడ్డి నిర్వహిస్తున్న రైతు మ్యారేజ్ బ్యూరోకు మన రాష్ట్రంలోనే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. గత పది రోజుల్లో తనకు 5వేల దాకా ఫోన్లు వచ్చాయని అంజిరెడ్డి చెప్పారు. కుల, మతాలకు అతీతంగా రైతు కుటుంబాలకు మాత్రమే అక్కడ పెళ్లి సంబంధాలు చూస్తారు. పెళ్లి సంబంధాల కోసం వెళ్లేవారు రూ.500 ఇచ్చి పూర్తి వివరాలతో కూడిన ప్రొఫైల్ను నమోదు చేసుకోవాలి. నిరుపేద రైతులైతే ఆ మొత్తం కూడా తీసుకోకుండా ఆయన పూర్తి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. వధువు కుటుంబీకులను సంప్రదించి వ్యవసాయం గొప్పదనం, రైతు రాబడి అవకాశాలను తెలియజేస్తూ సంబంధాలు కుదిరేలా చేస్తున్నారు.
రైతుల కుటుంబాల్లో అమ్మాయిలు సంతోషంగా ఉంటున్నారు
రైతు కుటుంబానికి అమ్మాయినిస్తే అక్కడ ఆమె కష్టపడాల్సి వస్తుందనే అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయం మునుపటిలా లేదు. ఎన్నో యంత్రాలు రావడంతో సాగు పనులు తేలికయ్యాయి. రైతు కుటుంబాల్లోని కోడళ్లు కూడా సంతోషంగానే ఉంటున్నారు.
ఉద్యోగస్తుల కుటుంబాల్లోని అమ్మాయిల మాదిరిగానే వారూ ఇంటిపట్టునే ఉంటున్నారు. పైగా కరోనాతో నెలకొన్న పరిస్థితుల్లో ఉద్యోగులతో పోల్చితే రైతులే ఇబ్బందులు లేకుండా ఉన్నారు. రైతు మ్యారేజ్ బ్యూరోకు మంచి స్పందన వస్తోంది.
– కేతిరెడ్డి అంజిరెడ్డి, రైతు మ్యారేజ్బ్యూరో నిర్వాహకుడు
Courtesy Andhrajyothi