పెళ్లి మండపంలో విషాదం
గుండెపోటుతో ఇద్దరి మృతి
మృతుల్లో వరుడి నానమ్మ, సమీప బంధువు
మృతికి డీజే శబ్దాలే కారణమై ఉండొచ్చని అనుమానం!
లింగాలఘణపురం: సన్నాయి మేళతాళాలు, డీజేతో సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే వరుడి నానమ్మ.. మరో బంధువు గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుందీ ఘటన. లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డికి దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ఇందుప్రియతో వివాహాన్ని జనగామ జిల్లా కేంద్రంలోని నందనగార్డెన్స్లో నిర్వహించారు. అందరూ పెళ్లి వేడుకల్లో మునిగి ఉండగా.. అనూహ్యంగా వరుడి నానమ్మ చల్లా పూలమ్మ(69) గుండెపోటుతో కుప్పకూలిపోయింది.
వెంటనే కుటుంబ సభ్యులు పూలమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ విషాద వార్త తొలిసే లోపే.. పెళ్లికి హాజరైన వరుడి సమీప బంధువు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన వల్లపురెడ్డి దేవేందర్రెడ్డి(76) ఐదు నిమిషాల తేడాతోనే గుండెపోటుకు గురై.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. వీరి మృతికి అపరిమితమైన డీజే శబ్దాలు కారణమై ఉండొచ్చని అక్కడివారంతా అనుమానం వ్యక్తం చేశారు.
Courtesy Andhrajyothi