– మద్రాస్ మాజీ చీఫ్ జస్టిస్ తహిలరమణి
– అభినందించిన బార్ అసోసియేషన్
చెన్నై:మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన ఏడాది పదవీకాలంలో 5040 కేసుల్ని పరిష్కరించినట్టు విజయ కె తహిలరమణి తెలిపారు. తనను మేఘాలయకు బదిలీ చేయడానికి నిరసనగా సెప్టెంబర్ 6న రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఆమె బహిరంగంగా మాట్లాడారు. మద్రాస్ బార్ అసోసియేషన్ తనకు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బార్ అసోసియేషన్లోని పలువురు ఆమెను అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎఆర్ఎల్ సుందరేశన్ మాట్లాడుతూ పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి బాధ్యతలూ చేపట్టబోనంటూ మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలకు తహిలరమణి రాసిన లేఖల్ని గుర్తు చేశారు.
మద్రాస్ హైకోర్టులో న్యాయవాదులు సహకరించడం వల్ల రోజుకు కనీసం 70 నుంచి 80 కేసుల్ని పరిష్కరించినట్టు ఆమె తెలిపారు. తన బదిలీపై పున:పరిశీలన జరపాలంటూ ఇచ్చిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించిన అనంతరం జస్టిస్ తహిలరమణి రాజీనామా సమర్పించారు. తహిలరమణిని గతంలో తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి, ఇప్పుడు తమిళనాడు నుంచి బదిలీ చేసిన సందర్భాల్లో న్యాయవర్గాలు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో, హైకోర్టుల జడ్జిలు, ప్రధాన న్యాయమూర్తుల బదిలీలన్నీ తగిన కారణాలతోనే ఉంటాయంటూ సెప్టెంబర్ 12న సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
తహిలరమణికి 2018 ఆగస్టు 8న మద్రాస్ హైకోర్టు చీఫ్జస్టిస్గా పదోన్నతి కల్పించారు. 2001, జూన్ 26న బోంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన తహిలరమణి 2020 అక్టోబర్ 2న రిటైర్ కావాల్సి ఉండగా, రాజీనామా చేయడం గమనార్హం. ఆమె బదిలీపై పలు విమర్శలొచ్చాయి. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11మంది దోషులకు ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను సమర్థించడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేసినట్టు అభియోగాలున్న ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ తీర్పు ఇచ్చిన బోంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో తహిలరమణి ఒకరన్నది గమనార్హం. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్బానోపై గ్యాంగ్రేప్ జరిగింది. గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలో ఆ రాష్ట్రానికి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రి అన్నది గమనార్హం.
Courtesy Nava telangana…